పశుగోస...
ABN , First Publish Date - 2020-03-30T09:47:39+05:30 IST
ఆకలితో ఆ మూగజీవులు చేసే ఆర్తనాదాలు విన్నవారిని కలిచివేస్తున్నాయి. తిండి పెడదామంటే పశుగ్రాసం లేని దుస్థితి.
కరోనా ఎఫెక్ట్తో పశుగ్రాసానికి కష్టం...
వారం రోజులుగా ఇమ్లిబన్ గో శాలకు అందని గ్రాసం..
ఆకలితో అలమటిస్తున్న ఆవులు, దూడలు
అఫ్జల్గంజ్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : ఆకలితో ఆ మూగజీవులు చేసే ఆర్తనాదాలు విన్నవారిని కలిచివేస్తున్నాయి. తిండి పెడదామంటే పశుగ్రాసం లేని దుస్థితి. లాక్డౌన్ వల్ల గోశాలకు పశుగ్రాసం తీసుకొచ్చే లారీలు ఆగిపోయాయి. ఫలితంగా తిండి లేక ఆవులు, దూడలు అలమటించిపోతున్నాయి. గౌలిగూడలోని ఇమ్లిబన్ గో శాలలోని పరిస్థితి ఇది. ఈ గో శాలలో దాదాపు 2వేలకు పైగా ఆవులు, దూడలు, కాడెద్దులు ఉన్నాయి. వీటికి ప్రతి రోజూ రెండు షిఫ్టుల వారీగా గో శాల నిర్వాహకులు పశుగ్రాసం పెట్టేవారు. దాతల సహాయంతో రెండు లారీల్లో వాటిని తెప్పించేవారు. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ మొదలైన నాటి నుంచి నేటి వరకు గోశాలకు పశుగ్రాసం సప్లయి చేసే లారీలు రావడం లేదు. ఉన్న పశుగ్రాసం అయిపోయింది. గో శాల నిర్వాహకులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పోలీసులు అనుమతివ్వడం లేదంటూ లారీ నిర్వాహకులు పశుగ్రాసం తీసుకోవడం లేదు.
స్థానికంగా ఉన్న కొందరు ప్రజలు తమ వద్ద ఉన్న బెల్లం, అటుకులు, రొట్టెలు, పండ్లు పెడుతూ ఏదో కొంచెంగా వాటి ఆకలిని తీర్చుతున్నారు. గో ప్రేమికుడు ముఖే్షకుమార్ ప్రజాపతి గోవుల పరిస్థితిని వీడియో తీసి ఆదుకోవాలని, ప్రధాని కూడా స్పందించాలని సోషల్ మీడియలో అప్లోడ్ చేశారు. అది వైరల్ అవ్వడంతో కొందరు దాతలు వచ్చి తమ వద్ద ఉన్న దాంతో ఆవుల కడుపు నింపుతున్నారు. అధికారులు స్పందించి లారీలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.