Vote advance register : 17 ఏళ్లు దాటితే ఓటు రిజిస్టర్కు ముందస్తు అవకాశం.. ఎన్నికల సంఘం కీలక మార్పులు
ABN , First Publish Date - 2022-07-29T02:51:16+05:30 IST
ఎలక్షన్ పోలింగ్(Poling)లో యువత భాగస్వామ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం(Election Commision) కీలక మార్పులు చేసింది.
న్యూఢిల్లీ : ఎలక్షన్ పోలింగ్(Poling)లో యువత భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం(Election Commision) కీలక మార్పులు చేసింది. 17 ఏళ్లు నిండి ఇంకా 18వ ఏడాది తగలని యువతీ, యువకులు ముందుస్తుగా ఓటు రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తద్వారా 18 ఏళ్లు వచ్చాక ఓటు నమోదు అవుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చు. కాగా ఇప్పటివరకు 18 సంవత్సరాల వయసు యువత అర్హతను బట్టి జనవరి 1కి ముందే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. జనవరి 1 తర్వాత 18 ఏళ్లు నిండినా దరఖాస్తు చేసుకునే అవకాశం లభించడం లేదు. ఏడాదిపాటు వేచిచూడాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం తాజా నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల చట్టంలో తాజా మార్పులతో 18 సంవత్సరాలు నిండిన యువత జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1న ఓటర్లుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం ఒక ప్రకటన చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని, సాంకేతిక పరిష్కారాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్రాల యంత్రాంగాలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ ఆదేశాలిచ్చింది. ఈ కమిటీలో ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండే కూడా సభ్యుడిగా ఉన్నారు. ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాలని స్పష్టం చేశారు. దీంతో ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి ఎలక్టోరల్ రోల్ అప్డేట్ అవుతుంది. అర్హత కలిగిన 18 ఏళ్లు నిండబోయే యువత ముందుగానే ఓటు కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. అంటే ఏప్రిల్ 2023 ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 లోపు 18 ఏళ్లు నిండే వ్యక్తులు ముందే దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.