భారత్లో ట్రంప్ రెండ్రోజుల షెడ్యూల్ ఇదీ.. భార్య మెలానియాతో కలిసి తాజ్మహల్కు కూడా..
ABN , First Publish Date - 2020-02-20T01:16:02+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో మన దేశంలో పర్యటిస్తారు.
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వీరిద్దరూ ప్రేమ సౌధం తాజ్ మహల్ సౌందర్యాన్ని కూడా వీక్షిస్తారు.
డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో మొదటి రోజైన సోమవారం ఆయన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ అనే భారీ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారు.
అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంను ఆధునికీకరించి, ఈ క్రికెట్ స్టేడియంను నిర్మించారు. దీని సామర్థ్యం 1,10,000 మంది కావడం విశేషం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం.
సోమవారం సాయం సంధ్య వేళలో డొనాల్డ్ ట్రంప్ తన ప్రియ సతీమణి మెలానియా ట్రంప్తో కలిసి ఆగ్రా వెళ్తారు. అక్కడి విశాల ప్రశాంత ఏకాంత సౌధం తాజ్ మహల్ అందాలను ఆస్వాదిస్తారు. ఈ ప్రేమ సౌధం వద్ద ఆత్మీయానురాగాలను పంచుకోవాలనే అభిలాష చాలా మందికి ఉంటుంది. అదేవిధంగా విదేశీ ప్రతినిథులు కూడా చాలా మంది ఇక్కడ ఫొటోలు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే.
మంగళవారం ఉదయం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే స్వాగత కార్యక్రమానికి ట్రంప్ దంపతులు హాజరవుతారు. రాష్ట్రపతి భవన్లోని రాజ ప్రాసాదంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరంరాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ స్మారక కేంద్రాన్ని సందర్శించి, ఆయనకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్లో మధ్యాహ్నం విందుకు హాజరవుతారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సమావేశాలు కూడా ఇక్కడే జరుగుతాయి. అనంతరం డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేస్తారు.
మంగళవారం మధ్యాహ్నం డొనాల్డ్ ట్రంప్ వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం ఆతిథ్యమిచ్చే విందులో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ట్రంప్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
మంగళవారం రాత్రి 10 గంటలకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ దంపతులు అమెరికా బయల్దేరుతారు. సుమారు 20 గంటల ప్రయాణం అనంతరం బుధవారం వీరిద్దరూ అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి చేరుకుంటారు.