దొంగ అరెస్ట్
ABN , First Publish Date - 2022-05-17T07:57:00+05:30 IST
ఓ దొంగను అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
రూ.17.71లక్షల 649 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం
తిరుపతి(నేరవిభాగం), మే 16: రాత్రిపూట ఎవరూలేని ఇళ్లలో దొంగతనాలను చేసే ఓ దొంగను అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 17,71,500 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి ఆటోనగర్కు చెందిన రమేష్ కుమారుడు కచ్చిలేటి వెంకటేష్ (27) చిన్నప్పటి జల్సాలకు అలవాటు పడ్డాడు. దీనికి కావాల్సిన డబ్బుకోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నెల్లూరు, తిరుపతి, తిరుపతి రూరల్ ప్రాంతాల్లో అనేక దొంగతనాలు చేశాడు. పోలీసులకు పట్టుబడి, జైలుకెళ్లి వచ్చాక కూడా చోరీలు చేస్తూనే ఉన్నాడు. మూడు నెలల కాలంలో అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, తిరుచానూరు పరిధిలో ఓ దొంగతనం చేశాడు. అప్పటినుంచి పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. సోమవారం ఉదయం ఆటోనగర్ బస్టాప్ వద్ద ఉండగా సీఐ అబ్బన్న, ఇతర సిబ్బంది గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 649 గ్రాములున్న 28 బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన అలిపిరి ఎస్ఐ చిన్నరెడ్డెప్ప, సిబ్బంది రవిరెడ్డి, ప్రసాద్, రాజశేఖర్లను డీఎస్పీ అభినందించారు.