కరోనా కష్టకాలంలో ఈ విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు..
ABN , First Publish Date - 2021-05-16T15:39:23+05:30 IST
ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో పౌష్ఠికర ఆహారాన్ని తీసుకోవాలని
హైదరాబాద్/అల్వాల్ : ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో పౌష్ఠికర ఆహారాన్ని తీసుకోవాలని వైధ్యులు సూచిస్తున్నారు. ఓమోగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, ఐరన్, ఫాస్పరస్ లాంటివి మొల కెత్తిన విత్తనాల్లో అధికంగా ఉంటాయి. నిత్యం వీటిని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. మొలకెత్తిన విత్తనాలు తింటే ఆరోగ్యం మెరుగవడమే కాకుండా తక్కువ ఖర్చులోనే ఎక్కువ విటమిన్లు పొందవచ్చని వివరిస్తున్నారు. పెసర్లు, గోధుమలు, శనగలు, మెంతులు తదితర ధాన్యాలను మొలకెత్తిన తరువాత తినాలని ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు.
తయారీ విధానం..
పెసల్లు, గోధుమలు, శనగలను విడివిడిగా ఒకరోజు నీటిలో నానబెట్టిన తరువాత ఒక కాటన్ క్లాత్లో వేసి గట్టిగా ముడివేసి కట్టాలి. అనంతరం ఒక రోజు తరువాత చిన్న మొలకలుగా వస్తాయి. వాటిని తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన విటమిన్, ఐరన్స్ కాల్షియం, పొటాషియం, ఫైబర్, ప్రొటీన్లు అందుతాయి. రోజు బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకున్నట్లయితే శరీర జీవక్రియ వేగం పెరిగి సులభంగా బరువు తగ్గడానికి అవకాశముంది. శరీరానికి కావాల్సిన సహజమైన పరిపూర్ణ ఆహారం మొలకెత్తిన గింజలని వైద్యులు పేర్కొంటున్నారు. సూపర్ మార్కెట్లో సైతం మొలకెత్తిన గింజలను విక్రయిస్తున్నారు. హోటళ్లలో, వివిధ రకాల శుభకార్యాల్లో సైతం మొలకెత్తిన గింజలను సైతం వడ్డిస్తున్నారు.
మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి మేలు
మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు కూడా అధికంగా ఉండటంతో ఇవి తీసుకున్నట్లయితే శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడుతాయి. మాంసాహారంలో లభిస్తున్న ప్రొటీన్లతో సమానంగా మొలకెత్తిన గింజల్లో ఉంటాయి. - డాక్టర్ ప్రసన్న లక్ష్మి, ప్రభుత్వ వైద్యురాలు.