ఆక్సిజన్ కొరత లేదు
ABN , First Publish Date - 2021-05-08T04:04:18+05:30 IST
జిల్లాలో ఆక్సిజన్కు కొరత లేదని.. గంటల వ్యవధిలో ఆస్పత్రులకు ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు జేసీ మహేష్కుమార్ తెలిపారు. జిల్లా అవసరాలకు సరిపడా ఆక్సిజన్ స్థానికంగా అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
జిల్లా అవసరాలకు సరిపడా ఉత్పత్తి
పర్యవేక్షణకు నోడల్ అధికారుల నియామకం
జేసీ మహేష్కుమార్ వెల్లడి
సీతానగరం(బొబ్బిలి), మే 7: జిల్లాలో ఆక్సిజన్కు కొరత లేదని.. గంటల వ్యవధిలో ఆస్పత్రులకు ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు జేసీ మహేష్కుమార్ తెలిపారు. జిల్లా అవసరాలకు సరిపడా ఆక్సిజన్ స్థానికంగా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. శుక్రవారం బొబ్బిలి గ్రోత్ సెంటర్లోని రెండు ప్రైవేటు ఆక్సిజన్ ప్లాంట్లను సబ్ కలెక్టర్ విదేఖరేతో కలిసి జేసీ పరిశీలించారు. ప్లాంట్లలో ఆక్సిజన్ లభ్యత, ఫిల్లింగ్ సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ఆగకుండా చూడాలని యాజమాన్యాలను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సమ దూరంలో ఉన్న బొబ్బిలి నుంచి ఆక్సిజన్ అందించేందుకు కేవలం గంట వ్యవధి పడుతుందని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులకు సైతం అనుమతిచ్చినట్టు తెలిపారు. రోజు విడిచి రోజు జిల్లాకు 10 కిలోలీటర్ల ఆక్సిజన్ ట్యాంకు వస్తోందని... సుమారు 500 సిలిండర్ల ఫిల్లింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 450 సిలిండర్లు అవసరమవుతున్నాయని చెప్పారు. ఆక్సిజన్ ఉత్పత్తి పర్యవేక్షణకు ముగ్గురు నోడల్ అధికారులను నియమించామని వివరించారు. వారి వెంట బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు, తహసీల్దారు ఆర్.సాయికృష్ణ, సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ జి.అశోక్కుమార్ ఉన్నారు.