వరినాట్లకు కూలీల కొరత
ABN , First Publish Date - 2022-08-14T06:31:23+05:30 IST
మండలంలో వరినాట్లుకు కూలీలు దొరక్క రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
పక్క మండలాల నుంచి తీసుకువస్తున్న వైనం
రెట్టింపు కూలి చెల్లిస్తున్న రైతులు
రావికమతం,ఆగస్టు 13: మండలంలో వరినాట్లుకు కూలీలు దొరక్క రైతులు ఇక్కట్లు పడుతున్నారు. దీంతో పక్క మండలాలు, గ్రామాల నుంచి కూలీలను రెట్టింపు కూలి ఇచ్చి తీసుకువస్తున్నారు. మండలంలో ఖరీఫ్లో 1,891 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. కల్యాణపులోవ ఆయకట్టు మినహా మిగిలిన ప్రాంతాల్లో రైతులు వర్షాధారంపైనే సాగు చేస్తున్నారు. తుఫాన్ వర్షాల కారణంగా చెరువులు, వాగుల్లో నీరు చేరడంతో ఖరీఫ్ దమ్ములు ప్రారంభమయ్యాయి. అయితే ట్రాక్టర్లతో దమ్ములు చేస్తున్నా మహిళా కూలీలు దొరక్కపోవడంతో వారికి డిమాండ్ పెరిగింది. సాధారణంగా మహిళా కూలీకి రోజు రూ.200 కూలి ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.400 నుంచి రూ.500 వరకూ చెల్లించాల్సి వస్తున్నదని రైతులు తెలిపారు. దమ్ము అయి సకాలంలో నాట్లు వేయకుంటే నీరు ఉండదనే భయంతో కూలీలు అడిగినంత కూలిని రైతులు చెల్లించాల్సి వస్తున్నది.