వాస్తవ పరిస్థితులను వైసీపీ మసిపూసి మారేడుకాయ చేస్తోంది

ABN , First Publish Date - 2020-10-01T08:08:42+05:30 IST

రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను వైసీపీ మసిపూసి మారేడుకాయ చేస్తోందని మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

వాస్తవ పరిస్థితులను వైసీపీ మసిపూసి మారేడుకాయ చేస్తోంది

పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప 


పెద్దాపురం, సెప్టెంబరు 30: రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను వైసీపీ మసిపూసి మారేడుకాయ చేస్తోందని మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడలేని స్థితిలో ఉన్నారన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు వాస్తవ పరిస్థితులను దాచిపెడుతున్నారని విమర్శించారు.


కాపు ఉద్యమ సమయంలో వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే రైలును దగ్ధం చేశారని, పైగా దానిని తమ పార్టీ అధినేత చంద్రబాబుపైకి నెట్టి బురదజల్లుతున్నారన్నారు. జడ్డి రామకృష్ణ సోదరుడిపై దాడిని కూడా తమ నాయకుడిపై రుద్దడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు మంత్రులకు కొమ్ముకాస్తూ వ్యవస్థ తప్పుదోవ పట్టేలా చేస్తున్నారన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా నియంత్రించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. న్యాయ వ్యవస్థ పోలీసులకు మొట్టికాయలు వేయడానికి కారణం వైసీపీ నాయకుల మాటలు వినడమేనని చెప్పారు.


Updated Date - 2020-10-01T08:08:42+05:30 IST