అనకాపల్లిలో రెపరెపలాడిన మువ్వెన్నల జెండా
ABN , First Publish Date - 2022-08-14T06:26:35+05:30 IST
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా శనివారం అనకాపల్లిలో మువ్వెన్నలజెండా రెపరెపలాడింది.
ఆజాదీకా అమృత్ మహోత్సవ భారీ ర్యాలీ... పాల్గొన్న మంత్రి, ఎంపీ, కలెక్టర్, విద్యార్థులు
అనకాపల్లిటౌన్, ఆగస్టు 13: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా శనివారం అనకాపల్లిలో మువ్వెన్నలజెండా రెపరెపలాడింది. రింగురోడ్డు జంక్షన్ వద్ద రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ర్యాలీని ప్రారంభించారు. ఎంపీ, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నాయకులు విద్యార్థులు భారతమాతకు జై, ఐ లవ్ ఇండియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రింగురోడ్డు జంక్షన్ నుంచి చిననాలుగురోడ్ల జంక్షన్, ఎన్టీఆర్ జంక్షన్ మీదుగా నెహ్రూచౌక్కు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయులను గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ రవి పట్టన్శెట్టి మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నారు. జిల్లా ఏర్పడిన తరువాత అనకాపల్లిలో మొట్ట మొదటిసారిగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకటరమణ, డీఈవో లింగేశ్వరరెడ్డి, డీఎఫ్వో లక్ష్మణమూర్తి, ఆర్డీవో చిన్నికృష్ణ, ఎంఈవో దివాకర్, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.