వైసీపీ ఖాతాలో మరో 3 ఎంపీటీసీలు
ABN , First Publish Date - 2020-03-14T12:05:07+05:30 IST
జిల్లాలో మరో మూడు ఎంపీటీసీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. కోటవురట్ల మండలం పాములవాక ఎంపీటీసీ స్థానానికి వైసీపీ నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి ఒకరు నామినేషన్లు వేశారు.
పాములవాక, వెదురువాడ, నునపర్తి ఏకగ్రీవం అయినట్టే...
విశాఖపట్నం, మార్చి 13: జిల్లాలో మరో మూడు ఎంపీటీసీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. కోటవురట్ల మండలం పాములవాక ఎంపీటీసీ స్థానానికి వైసీపీ నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి ఒకరు నామినేషన్లు వేశారు. ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని శుక్రవారం ఇరుపార్టీల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ కిల్లాడ వెంకటేశ్వరసాయి భార్య వెంకటలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. దీంతో వైసీపీ డమ్మీ అభ్యర్థి కిల్లాడ సత్యవేణి, టీడీపీ అభ్యర్థి సుర్ల కృష్టవేణి శుక్రవారం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పాములవాక ఎంపీటీసీ స్థానం వైసీపీ పరం అయ్యింది. మండలంలో రాజుపేట ఎంపీటీసీ స్థానం ఇప్పటికే వైసీపీ ఖాతాలో చేరిన విషయం తెలిసిందే.
అచ్యుతాపురంలో రెండు స్థానాలు...
అచ్యుతాపురం మండలంలో వె దురువాడ, నునపర్తి ఎంపీటీసీ సెగ్మెంట్ల నుంచి వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టేనని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ వారు నామినేషన్లు వేయలేదు. నునపర్తి నుంచి వైసీపీ తరపున కొల్లి వెంకటేశ్వరరావు, అతనికి డమ్మీగా కొల్లి త్రినాథరావు నామినేషన్లు వేశారు. త్రినాథరావు శనివారం తన నామినేషన్ను ఉపసంహరించుకుంటారని, వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికవుతారని చెప్పారు. వెదురువాడ సెగ్మెంట్ నుంచి పి.వరలక్ష్మి(వైసీపీ), డమ్మీగా మరొకరు నామినేషన్ వేశారు. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు.