అత్తను హత్య చేసిన అల్లుడు!
ABN , First Publish Date - 2021-03-04T05:24:52+05:30 IST
మండల పరిధిలో జక్కం గ్రేసమ్మ (51) అనే మహిళను సొంత అల్లుడు సూర్యబాబు దారుణంగా హత్య చేశాడు.
ప్రొద్దుటూరు క్రైం, మార్చి 3 : మండల పరిధిలో జక్కం గ్రేసమ్మ (51) అనే మహిళను సొంత అల్లుడు సూర్యబాబు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బుధవారం వెలుగు చూడగా, పోలీసుల వివరాలిలా ఉన్నాయి. స్థానిక వివేకానందనగర్లో నివాసముంటున్న గ్రేసమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెల్లో రెండో కుమార్తె మరియమ్మ నక్కలదిన్నెలో ఉంటోంది. మరియమ్మను చూసేందుకు గ్రేసమ్మ సోమవారం వెళ్లింది. మంగళవారం సాయంత్రం ఊరికి వెళ్తానని చెప్పడంతో తల్లిని మరియమ్మ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా, తాను బైక్లో విడిచిపెడతానంటూ మరియమ్మ భర్త కమతం సూర్యబాబు బైక్లో కూర్చోబెట్టుకుని బయలుదేరాడు. అయితే ఏమైందో ఏమో కానీ మార్గమధ్యం చెన్నమరాజుపల్లి దారిలో కంపచెట్లలో గ్రేసమ్మ శవమై కన్పించింది. తలపై, కన్ను వద్ద బలమైన గాయాలైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా గ్రేసమ్మను బైక్లో తీసుకొచ్చిన సూర్యబాబు ఇంటికి రాకపోవడం, అతడి సెల్ఫోన్ స్విచ్ఆ్ఫలో ఉండటంతో గ్రేసమ్మను అల్లుడు సూర్యబాబు హత్య చేసి ఉంటాడని పోలీసులు నిర్ధ్దారణకు వచ్చారు. కాగా రూరల్ సీఐ విశ్వనాధరెడ్డి, ఎస్ఐ లక్ష్మినారాయణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రేసమ్మ హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. కుటుంబ కలహాల వల్లే గ్రేసమ్మను అల్లుడు హత్య చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతురాలి కుమారుడు శాంతుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మినారాయణ తెలిపారు.