దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-11-30T05:26:38+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగుల జేఏసీ నాయకులు కోరారు.
సుభాష్నగర్, నవంబరు 29: రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగుల జేఏసీ నాయకులు కోరారు. సోమవారం తెలంగాణ దివ్యాంగులు, స్త్రీ, శిశు, వృద్దుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమ శాఖను స్త్రీ, శిశు, వృద్దుల సంక్షేమ శాఖ నుంచి వేరు చేయాలని కోరారు. ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక దివ్యాంగుల ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా దివ్యాంగులకు ఫించన్లు ఇవ్వాలని, దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయాలని కోరారు. ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు మొగిలి లక్ష్మయ్య, ముత్తినేని వీరయ్య, అడివయ్య, సతీష్, గుండపనేని వెంకట్, మేకల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.