కొబ్బరి అధరహో

ABN , First Publish Date - 2020-08-07T11:54:03+05:30 IST

కొబ్బరి ధర పెరిగింది. రైతుల మోములో ఆనందం వెల్లి విరుస్తోంది. నాలుగు నెలలుగా కరోనా నేపఽథ్యంలో కొబ్బరి ధరలు కనిష్ట ..

కొబ్బరి అధరహో

వెయ్యి కాయలు.. రూ.పది వేలకు చేరిన ధర

ఊపందుకున్న ఎగుమతులు.. రైతుల్లో ఆనందం


పాలకొల్లు, ఆగస్టు 6 : కొబ్బరి ధర పెరిగింది. రైతుల మోములో ఆనందం వెల్లి విరుస్తోంది. నాలుగు నెలలుగా కరోనా నేపథ్యంలో కొబ్బరి ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. పది రోజులుగా ఎగుమతులు ఊపందుకోవడంతో ధరలు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల కిందట వెయ్యి కాయల ధర రైతు వద్ద రూ.8-9 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.10 వేలకు చేరింది. ఈ నెల 22వ తేదీ వినాయకచవితి సందర్భంగా కొబ్బరి మార్కెట్‌కు మరింత కళ రావచ్చని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎగుమతి ధరలు వర్తకులకు లాభదా యకంగానే ఉన్నాయి. ఢిల్లీ క్వాలిటీ గండేరా సీలు కాయ రూ.12, పచ్చి కాయ రూ.11లకు, 70-80 బత్తీలు వెయ్యి కాయలు రూ.7 వేలు, నెంబరు కాయ (50 బత్తీలు) రూ.8,500లకు ఎగుమతి అవుతున్నాయి. రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రలతోపాటు హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు కొబ్బరి ఎగుమతులు జరు గుతున్నాయి. జిల్లాలో  25 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. మరో 5 వేల హెక్టార్ల విస్తీర్ణానికి సరిపడా రహదార్ల వెంబడి, పుంతలు, కాలువగట్లపైన కొబ్బరి చెట్లు విస్తరించి ఉన్నాయి.


ఈ నేపథ్యంలో  రోజుకు సుమారు వంద లారీల కొబ్బరి కాయలు ఎగుమతి అవుతుండగా, లారీకి  25 వేల నుంచి 30 వేల కాయలు ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతులు పెరగడంతో చిల్లరగా అమ్మే కొబ్బరి కాయల ధర లు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాయ సైజును బట్టి రూ. 15 నుంచి రూ. 20లకు విక్రయిస్తున్నారు. ‘పది రోజులుగా కొబ్బరి ఎగుమతులు ఊపందుకున్నాయి. ధరలు పెరగడంతో రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పుడు జిల్లాలో ఆయా ప్రాంతాలను బట్టి రైతుల వద్ద రూ. 9 నుంచి రూ.10 వేలకు కొనుగోలు చేస్తున్నాం. వచ్చే వారం, పది రోజుల్లో ధర మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది’ అని వేడంగిపాలెంకు చెందిన కొబ్బరి వ్యాపారి కొండేటి చంద్రరావు చెబుతున్నారు. 

Updated Date - 2020-08-07T11:54:03+05:30 IST