హుజూరాబాద్‌ ప్రజలు అవసరమైతే బరిగీసి కొట్లాడుతారు

ABN , First Publish Date - 2021-10-21T06:01:33+05:30 IST

: ప్రేమకు లొంగే హుజూరాబాద్‌ ప్రజలు అవసరమైతే బరిగీసి కొట్లాడుతారని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు.

హుజూరాబాద్‌ ప్రజలు అవసరమైతే బరిగీసి కొట్లాడుతారు
వీణవంక మండలం కిష్టంపేటలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

 కేసీఆర్‌పై ఈటల ధ్వజం

 మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

వీణవంక, అక్టోబరు 20: ప్రేమకు లొంగే హుజూరాబాద్‌ ప్రజలు అవసరమైతే బరిగీసి కొట్లాడుతారని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం వీణవంక మండలంలోని కిష్టంపేట, ఘన్ముక్ల, రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, రామకృష్ణాపూర్‌, లస్మక్కపలెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ దళితుల మీద ప్రేమతో దళితబంధు పెట్టలేదని, 4 6వేల దళితుల ఓట్లపై కన్నేసి కేసీఆర్‌ 10లక్షలు ఇస్తున్నాడన్నారు. హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌ లాంటి చోట్ల మోసం చేయవచ్చు.. కానీ హుజూరాబాద్‌లో మోసం చేయడం మీకు సాధ్యం కాదన్నారు. కాపలా కుక్కలాగా ఉంటానని చెప్పిన కేసీఆర్‌ వారి కుటుంబంలో ఐదుగురికి పదవులు ఇచ్చుకొని మనల్ని బానిసలుగా మార్చాడన్నారు. మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చాడా అని ప్రశ్నించారు. నా ముఖం అసెంబ్లీలో కనిపించకూడదంటున్నారని, రేపు ఎవరి ముఖం కనిపించదో చూద్దామన్నారు. నర్సింగాపూర్‌ గ్రామంలో తన భార్య ప్రచారం చేసి ఒకరింట్లో కార్యకర్తలతో కలిసి టెంట్‌ వేసుకొని భోజనం చేస్తుంటే తినేదాకా ఆగమన్నా ఆగకుండా టెంట్‌ తీసేసిన మూర్ఖులు వీళ్లని, ఇలాంటి చిల్లర పనులు చేస్తే ఓట్లు పడుతాయా అని ప్రశ్నించారు. 30వ తారీఖు తర్వాత కేసీఆర్‌ కాదు, ఆయన జేజెమ్మతో కొట్లాడుతానన్నారు. ఎవరి మాటలు నమ్మకుండా ఉప ఎన్నికలో నిండు మనస్సుతో ఆశీర్వందించాలని కోరారు. సీఎంకు దమ్ముంటే 30వ తేదీలోపు కలెక్టర్‌ పెత్తనం లేకుండా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌,  నాయకులు మాడ గౌతమ్‌రెడ్డి, మారముల్ల కొంరయ్య, రాజు, సమ్మయ్య, రాజిరెడ్డి, పెద్ది మల్లారెడ్డి, సదానందం, బత్తిని నరేష్‌, సునీల్‌రెడ్డి, రాజయ్య, రాజు, కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:01:33+05:30 IST