ఆలయాల్లో సనాతన ధర్మం వెల్లివిరియాలి
ABN , First Publish Date - 2022-05-23T06:37:01+05:30 IST
జగద్గురువులు చూపిన బాటలో ఆలయాల్లో సనాతన ధర్మం వెల్లివిరియాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వర్రావు అన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముక్తేశ్వర్రావు
నార్కట్పల్లి, మే 22: జగద్గురువులు చూపిన బాటలో ఆలయాల్లో సనాతన ధర్మం వెల్లివిరియాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వర్రావు అన్నారు. ఆది శైవ బ్రాహ్మణ అర్చక సంఘం, సోమేశ్వర శివజ్ఞాన పీఠం సంయుక్తంగా మండలంలోని చెర్వుగట్టులో ఆదివారం నిర్వహించిన త్రిదినాత్మక శైవ వాజ్మయ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. తల్లి తన శిశువును ఎంత జాగ్రత్తగా లాలిస్తుందో అర్చకులు కూడా అంతే భక్తిపూర్వకంగా కైంకర్యాలు నిర్వహించాలన్నారు. వేదాల్లోని సారం ఆధునిక జీవన విధానానికి దోహదపడేలా పండితులు కృషి చేయాలన్నారు. సనాతన ధర్మ సంప్రదాయాల విస్తృతికి ఇలాంటి సదస్సులు, పండిత గోష్ఠిలు ఎంతో దోహదపడతాయన్నారు. భక్తుల్లో దేవుడిపై భక్తివిశ్వాసాలు పెంపొందించాల్సిన బాధ్యత అర్చకులదేనన్నారు. వేదాల్లోని శైవ వైభవాన్ని మరింత ప్రాచుర్యం తెచ్చేలా ఆదిశైవ బ్రాహ్మణ అర్చక సంఘం సంకల్పాన్ని ఆయన అభినందించారు. అనంతరం శివవైభంపై నాగలింగం హరిహరపంత్, శివ భక్తితత్వంపై వైష్ణవ వెంకటరమణమూర్తి ఉపన్యసించారు. యజుర్వేదంలోని కొన్ని మంత్రాలను కంఠస్థం చేసి సదస్సులో పఠించిన నల్లగొండ మండలం అప్పాజిపేటకు చెందిన దాసోజు సంజన, సౌమ్యను ముక్తేశ్వర్రావుతో పాటు వేద పండితులు అభినందించారు. సదస్సులో పోతులపాటి రామలింగేశ్వర శర్మ, నీలకంఠశాస్ర్తి, పవన్వంశిశ్రీ, శివప్రసాద్, రాజశేఖర్శర్మతో పాటు పలు శివాలయాల ప్రధానార్చకులు పాల్గొన్నారు.