కుప్పం పురపాలక సంఘం 25 వార్డులుగా విభజన

ABN , First Publish Date - 2020-02-18T10:43:55+05:30 IST

జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కుప్పం పురపాలక సంఘాన్ని 25 వార్డులుగా విభజిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కుప్పం పురపాలక సంఘం 25 వార్డులుగా విభజన

కుప్పం, ఫిబ్రవరి 17: జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కుప్పం పురపాలక సంఘాన్ని 25 వార్డులుగా విభజిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విభజిత వార్డులకు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను ఈనెల 18నుంచి ఈనెల 24వ తేదీదాకా అంటే వారం రోజులపాటు కుప్పం పురపాలక సంఘ కార్యాలయం, మండల సచివాలయంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రదర్శిస్తామని చెప్పారు.


ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రజలనుంచి అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులనుంచి ఎటువంటి సలహాలు, సూచనలు, అభ్యంతరాలున్నా ఈ వారం రోజుల్లోగా తెలియజేయాలని కోరారు. ఆ తర్వాత వార్డు విభజన ప్రతిపాదనలను ఈనెల 25వ తేదీన కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. ఆపైన కలెక్టర్‌, ఇదే ప్రతిపాదనలను పురపాలక పరిపాలన శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌కు ఈనెల 27వ తేదీన సమర్పిస్తారని తెలిపారు. కమిషనర్‌ వార్డు విభజన ప్రతిపాదనలను కూలంకషంగా పరిశీలించిన తర్వాత 29వ తేదీన అప్రూవల్‌ చేస్తారన్నారు. అలా కమిషనర్‌నుంచి అప్రూవల్‌ అయి వచ్చిన కుప్పం పురపాలక సంఘం వార్డు విభజనకు సంబంధించి మున్సిపల్‌ కమిషనర్‌ వచ్చే నెల 2వ తేదీన తుది ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని ఆమె వివరించారు.


Updated Date - 2020-02-18T10:43:55+05:30 IST