భూ సమస్య పరిష్కారం కాక రైతు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-10-19T05:15:02+05:30 IST
తన భూమి.. వేరే వారి పేరిట నమోదవగా.. ఏళ్ల తరబడి సమస్య పరిష్కారం కాక, చివరకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణిలోనూ అవకాశం లేదని అధికారులు చెప్పడంతో
ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదం
ధరణిలోనూ మార్పులు, చేర్పులకు అవకాశం లేదన్న అధికారులు
విసుగుచెంది ఆందోళనకు దిగిన బోనకల్ రైతు
బోనకల్, అక్టోబరు 18: తన భూమి.. వేరే వారి పేరిట నమోదవగా.. ఏళ్ల తరబడి సమస్య పరిష్కారం కాక, చివరకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణిలోనూ అవకాశం లేదని అధికారులు చెప్పడంతో విసిగి పోయిన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఖమ్మం ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్ మండలం రావినూతలకు చెందిన మరీదు వెంకటేశ్వర్లు భార్య వెంకటలక్ష్మికి అదే మండలం గార్లపాడు రెవెన్యూ పరిఽధిలోని 24/అ/3 సర్వే నెంబర్లో 0.38 కుంటల భూమి ఉంది. భార్య మృతి చెందడంతో 2018లో ఆ భూమిని మేజర్ అయిన కుమార్తె పేరిట రిజిసే్ట్రషన చేయించేందుకు వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేశాడు. కానీ రికార్డుల్లో ఆ భూమి తన సోదరుడి కుమారుల పేరిట పాసుబుక్ ఇచ్చినట్టుగా ఉండటంతో వెంకటేశ్వర్లు అవాక్కయ్యాడు. దాంతో ఆ భూమి తన భార్యదని, ఆమె చనిపోవడంతో ఆ భూమిని తన కూతురి పేరిట రిజిసే్ట్రషన్ చేయించాలనుకుంటున్నానని, సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. చివరకు ప్రభుత్వ ప్రవేశపెట్టిన ధరణిలో మార్పు చేయించుకునేందుకు అధికారులను సంప్రదించాడు. కానీ వెబ్సైట్లో మార్పులు, చేర్పులకు అవకాశం లేదని, భూ రికార్డుల్లో తప్పులు దొర్లితే పాస్పుస్తకంలో పేరున్న వారే తిరిగి వాస్తవిక రైతుకు రిజిసే్ట్రషన చేస్తేనే సమస్యకు పరిష్కారం లబిస్తుందన్నారు. కానీ వెంకటేశ్వర్లు భూమిని తిరిగి ఆయన కుమార్తెకు రిజిసే్ట్రషన చేసేందుకు సోదరుడు కుమారులు అంగీకరించక పోవడంతో సమస్య జటిలంగా మారి విసిగి పోయిన బాధిత రైతు పురుగులమందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగి.. పురుగులమందు తాగేందుకు ప్రయత్నించగా అక్కడివారు అడ్డుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్ను సంప్రదించగా ధరణి వచ్చాక తప్పులను సరి చేసే విషయం తన చేతిలో లేదని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని సమాధానమిచ్చారు.