యోగిని కలిసిన 'ది కశ్మీర్ ఫైల్స్' టీమ్
ABN , First Publish Date - 2022-03-21T00:48:44+05:30 IST
ఉత్తరప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్ను..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంది బెన్ పటేల్ను 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్ర యూనిట్ ఆదివారంనాడు కలుసుకుంది. చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, అఖిషేక్ అగర్వాల్ సీఎం కార్యాలయాలని వెళ్లి యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. ఆ వివరాలను యోగి ఆదిత్యనాథ్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. సినిమాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.
''ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం మతోన్మాదం, ఉగ్రవాదం సృష్టించిన అమానవీయ కోణాన్ని నిష్పాక్షికంగా చూపించింది. ఈ సినిమా సమాజాన్ని, దేశాన్ని జాగృతం చేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అందర్నీ ఆలోచింపజేసే చక్కటి చిత్రాన్ని నిర్మించిన చిత్ర యూనిట్కు నా అభినందలు'' అని యోగి ఆదిత్యనాథ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ఈ నెల 11న దేశవ్యాప్తంగా విడుదలైంది. 'తాస్కెంట్ ఫైల్స్', 'హేట్ స్టోరీ', 'బుద్ధ ఇన్ ఎ ట్రాఫిక్ జామ్' వంటి చిత్రాలతో మంచిపేరు తెచ్చుకున్న వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ను షేక్ చేస్తూ ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరడంతో పాటు భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా, యూపీలో ఈ చిత్ర ప్రదర్శనకు పన్ను మినహాయిస్తున్నట్టు యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.