క్రీడల్లో జిల్లా కీర్తిని చాటాలి
ABN , First Publish Date - 2022-08-18T04:53:52+05:30 IST
సిద్దిపేట కీర్తిని చాటేలా క్రీడల్లో ఎదగాలని అథ్లెటిక్స్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ పేర్కొన్నారు.
అథ్లెటిక్స్లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఎంపికైనవారికి ఈ నెల 24 నుంచి మెదక్లో జరుగనున్న రాష్ట్రస్థాయి క్రీడల్లో అవకాశం
సిద్దిపేట టౌన్, ఆగస్టు 17: సిద్దిపేట కీర్తిని చాటేలా క్రీడల్లో ఎదగాలని అథ్లెటిక్స్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సిద్దిపేట జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా 60, 100, 200, 400, 800, 2 వేలు, 3వేలు, 5వేల మీటర్ల పరుగు పందెం, షాట్పుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్ తదితర అంశాల్లో ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నుంచి దాదాపు 450 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 24, 25 తేదీల్లో మెదక్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు సంఘం కార్యదర్శి వెంకటస్వామి గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్వో నాగేందర్, ఎంపీడీవో సమ్మిరెడ్డి, సిద్దిపేట జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు, రామేశ్వర్రెడ్డి, పీడీ అశ్వినిరెడ్డి ఉన్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ అర్బన్, ఆగస్టు 17: 8వ తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ఛాంపియన్షిప్ జిల్లా స్ధాయి ఎంపిక పోటీలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ మైదానంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-14, 16, 18, 20 బాల బాలికలకు వివిధ క్రీడల్లో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా అఽథ్లెటిక్స్ అసోసియేషిన్ కార్యదర్శి మధుసూదన్, మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్, పీఈటీలు సుజాత, శ్వేత, సంతోష్, చరణ్, క్రీడాకారులు పాల్గొన్నారు.