ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ భవన డిజైన్ ఖరారు
ABN , First Publish Date - 2022-07-07T04:56:26+05:30 IST
చేర్యాలలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ భవన నిర్మాణానికి ఎన్నో ఒడిదుడుకుల మధ్య డిజైన్లు ఖరారయ్యాయి.
భవన నిర్మాణానికి రూ.5.10 కోట్ల వ్యయం
గతానికి అదనంగా మరో రూ.2 కోట్లు
చేర్యాల, జూలై 6: చేర్యాలలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ భవన నిర్మాణానికి ఎన్నో ఒడిదుడుకుల మధ్య డిజైన్లు ఖరారయ్యాయి. ఇటీవల సంబంధితశాఖ ఉన్నతాధికారులు ఆమోదించడంతో భవనం పనులు ప్రారంభానికి నోచుకోనున్నాయి. ముందస్తుగా వ్యవసాయ మార్కెట్యార్డులో ప్రతిపాదించిన స్థలం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో గతంలో గ్రామపంచాయతీ హయాంలో నిర్మించిన 48 మడిగలతో పాటు మునిసిపల్ కార్యాలయ భవనాన్ని కూల్చేసి ఇదే ప్రదేశంలో నిర్మించేందుకు నిర్ణయించారు. కొద్దిరోజుల క్రితం మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేసిన క్రమంలో అన్నింటిని కూల్చివేసి చదును చేశారు. 19 కూరగాయల, 14 మాంసం విక్రయ, 9 పండ్లు, పూల దుకాణాలతో పాటు మునిసిపల్కు శాశ్వత ఆదాయం సమకూరాలన్న ఆలోచన తో ప్రధాన రహదారి వైపు 17 షట్టర్లు నిర్మించేలా డిజైన్ రూపొందించారు. ముందస్తుగా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3 కోట్లు ప్రతిపాదిత వ్యయంతో చేపట్టాలని నిర్ణయించినా, మార్పుల కారణంగా మరో రూ.2 కోట్లు అదన పు వ్యయం పెరిగింది.
అంగడిబజారు దారిపై రచ్చరచ్చ
స్థలాభావం కారణంగా భవనాన్ని సుందరంగా నిర్మించడం కోసం అంగడిబజారు దారిని మూసేస్తూ వాటర్ ట్యాంక్ను కూల్చి ప్రత్యామ్నాయ దారిని పునరుద్ధరిస్తామని కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రకటించారు. ఈ విషయమై డిజైనింగ్ను కూడా తయారు చేశారు. దారిని మార్చవద్దని యధావిధిగా కొనసాగించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు. స్పందించిన చైర్పర్సన్ స్వరూపారాణి దారిని మూసివేయడం లేదని ప్రకటించారు.