చెరువులో దూకిన విద్యార్థి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2022-08-17T05:13:54+05:30 IST
చెరువులో దూకిన విద్యార్థి మృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16: ఇబ్రహీంపట్నం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడి మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. మృతుడు నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాత్మకాపూరు గ్రామానికి చెందిన ఎస్.విష్ణువర్దన్రెడ్డి(19)గా గుర్తించారు. మృతుడు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో అమ్మమ్మ బూతుకూరు బుచ్చమ్మ దగ్గర ఉంటూ మంగల్పల్లి భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. సోమవారం ఉదయం 10.30గంటలకు చెరువు పెద్దతూము పైనుంచి చెరువులో దూకగా గమనించిన ఓ మహిళ వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందజేసింది. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. తిరిగి మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలించగా ఎట్టకేలకు మృతదేహాన్ని వెలికితీశారు. విద్యార్థి ఆత్మహత్యకు ఆన్లైన్ లోన్యాప్ కారణం కావచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.