వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి
ABN , First Publish Date - 2022-05-23T06:19:43+05:30 IST
వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు.
మాజీ మంత్రి అఖిలప్రియ
చాగలమర్రి, మే 22: వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. చాగలమర్రి గ్రామంలో ఆదివారం ఓ కార్యక్రమానికి ఆమెతో పాటు భార్గవ్రామ్, భూమా జగత్ విఖ్యాతరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామదేవత చాగలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మూడేళ్ల వైసీపీ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆరోపించారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, కార్యకర్తలు ఐకమత్యంతో ముందుకు వెళ్లి రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని కోరారు. చాగలమర్రిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు విజయవంతం చేశారని, దీంతో కార్యకర్తలు, అభిమానులను చంద్రబాబు నాయుడు అభినందించారని అన్నారు. తన చేతికి గాయం కావడంతో కర్నూలులో జరిగిన పార్టీ సమావేశానికి హాజరు కాలేకపోయానని, అయితే దీనిపై కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. భూమా కుటుంబం టీడీపీతోనే ఉంటుందని, ఎలాంటి అపోహలు వద్దని మాజీ మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు. టీడీపీ మైనార్టీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సర్బాషా, టీఎన్టీయూ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, టీడీపీ నాయకులు జెట్టి సుధాకర్, కొలిమి ఉసేన్వలి, కొలిమి షరిఫ్, మౌళాలి, అనిఫ్, జెట్టి నాగరాజు, శ్యాబుల్, గఫార్, బషీర్, జోసఫ్, షమీమ్, సోను, లడ్డుబాషా, సంజీవరాయుడు పాల్గొన్నారు.