క్వారంటైన్పై కాకి లెక్కలు
ABN , First Publish Date - 2020-03-31T09:35:36+05:30 IST
క్వారంటైన్లో ఉన్న వారి లెక్కలపై..
పొంతనలేని మూడు శాఖల గణాంకాలు...
మంత్రి ముత్తంశెట్టి తీవ్ర అసహనం
చోడవరం(విశాఖపట్నం): క్వారంటైన్లో ఉన్న వారి లెక్కలపై పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీవ్రఅసహనం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కట్టడి, లాక్డౌన్ అమలు చర్యలపై సోమవారం ఇక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి చోడవరం నియోజకవర్గంలోని గ్రామాలకు వచ్చిన వారిలో ఎంతమందిని క్వారంటైన్లో ఉంచారన్నదానిపై పోలీసు అధికారులు 80 మంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 64 మంది, తహసీల్దార్లు/ ఎండీవోలు 69 మంది వున్నట్టు చెప్పారు. దీంతో మంత్రి మండిపడ్డారు.
అనకాపల్లి ఆర్డీవో సీతారామారావుపై అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించి సమన్వయం చేయకుండా ఎక్కడో కూర్చుని మానిటరింగ్ చేస్తే బాగోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గ్రామాల్లో బ్లీచింగ్ చల్లారు? ఎన్నిసార్లు చల్లారు? అన్నదానిపై పంచాయతీ అధికారులు సరైన సమాధానాలు చెప్పలేదు. డీపీవో గోవిందరావు మాట్లాడుతూ, ప్రస్తుతం పంచాయతీల్లో బ్లీచింగ్ కొంతమేర మాత్రమే ఉందని, 15 వేల బస్తాల బ్లీచింగ్, 20 వేల లీటర్ల ఫినాయిల్ తెప్పిస్తున్నామన్నారు. కాగా సమావేశానికి గైర్హాజరైన రావికమతం పీహెచ్సీ వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్యే ధర్మశ్రీ, డీఎస్పీ శ్రావణి, ట్రైనీ డీఎస్పీ డాక్టర్ రవికిరణ్, పీహెచ్సీలల వైద్యులు, తహసీల్దార్లు, ఎండీవోలు పాల్గొన్నారు.
శానిటైజర్లు తయారు చేయండి
గోవాడ షుగర్స్లో ఉప ఉత్పత్తి అయ్యే మొలాసిస్తో శానిటైజర్లు తయారు చేయాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, షుగర్ ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడిని ఆదేశించారు.