కరోనా నశించాలి
ABN , First Publish Date - 2020-10-25T05:55:29+05:30 IST
ఈ ఏడాది మార్చి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది.
విజయం వరించాలి
నేడు దసరా పండుగ
మహబూబ్నగర్/నారాయణపేట/గద్వాల టౌన్, అక్టోబరు 24 : ఈ ఏడాది మార్చి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైంది. రక్కసిలా విరుచుకుపడుతూ ఏడు నెలలు కావస్తున్నా, ఇంకా ఆ మహమ్మారి ఉమ్మడి జిల్లాను వదిలి వెళ్లడం లేదు. దీని బారిన పడి ఇప్పటికే 250 మందికిపైగా మృత్యువాత పడగా, వేల మంది దీని పంజా బారిన పడి ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారు. వైరస్ దెబ్బకు వ్యాపార, వాణిజ్య రంగాలు దెబ్బతిన్నాయి. దీనికితోడు మూడు దశాబ్దాలలో లేని వర్షాలు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో విరుచుకు పడ్డాయి. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వేల ఎకరాల్లో వరి, కంది, ఆముదం, పత్తి, జొన్న తుడుచుపెట్టుకుపోయాయి. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా జరుపుకునే విజయదశమి నుంచి రోజులు మారాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కరోనా నశించడంతో పాటు వ్యాపార, ఇతర ఉపాధి రంగాలన్నీ మళ్లీ పుంజుకోవాలని, అలాంటి విజయాన్ని ప్రసాదించాలని ఆదివారం విజయదశిమి సందర్భంగా ప్రజలంతా కోరుకుంటున్నారు.
సాదాసీదాగా ఉత్సవాలు
దసరా పండుగను జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా, శనివారమే స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. అయితే, కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ, పండుగను జరుపుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో నిర్వహించే బాణాకంచ, రావణ దహనం కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో సాయంత్రం ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాంమందిర్ చౌరస్తాలోని దసరా కట్ట వద్ద జెండాను ఎక్కించి, అక్కడే షమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.