లోయలో పడ్డ బస్సు
ABN , First Publish Date - 2021-11-30T05:35:42+05:30 IST
ఎగువ అహోబిలంలో ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం 25 అడుగుల లోతున్న లోయలో పడింది. ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఆళ్లగడ్డ, నవంబరు 29: ఎగువ అహోబిలంలో ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం 25 అడుగుల లోతున్న లోయలో పడింది. ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏపీ 28 జడ్ 5842నెంబరు గల ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో బస్సు ఉదయం 10.30 గంటలకు ఎగువ అహోబిలంలో బయలుదేరింది. డ్రైవరు జేకే బాషా రివర్స్ చేసుకునే ప్రయత్నంలో బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో డ్రైవరుతో కలిపి నలుగురు ఉన్నారు. ఓబులేసు(మైదుకూరు), వెంకటలక్ష్మమ్మ (ధర్మవరం) స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవరు, మరో వ్యక్తి సురక్షితంగా బయట పడ్డారు. నంద్యాల ఆర్టీసీ డీవీఎం, నంద్యాల ఇనచార్జి ఆర్డీవో మల్లికార్జునుడు, ఆర్టీసీ డీఎం రాజశేఖరరెడ్డి, తహసీల్దార్ రమేష్రెడ్డి, రూరల్ సీఐ రాజశేఖరరెడ్డి, అహోబిలం ఈవో నరసయ్య అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు సోమవారం సాయంత్రం బస్సును లోయలో నుంచి బయటకు తీశారు. ప్రమాదంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రయాణికులు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.