రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
ABN , First Publish Date - 2021-01-16T05:44:47+05:30 IST
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
- మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మాజీమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు జోస్యం చెప్పారు. తన కుటుంబసభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లాలోని అనంతపద్మనాభ స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరంస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం హరితరిసార్ట్స్లో బీజేపీ జిల్లా నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడారు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ అధికారంలోకి రావాల్సి ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితులు బీజేపీ అధికారంలోకి వచ్చేలా అనుకూలంగా ఉన్నాయని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుకున్న దాని కంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేస్తున్నారని, ఆయన కృషి ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుందని విద్యాసాగర్రావు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమకు రెండు సీట్లు ఉన్నా.. రానున్న రోజుల్లో శాసనసభలో బీజేపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. వికారాబాద్జిల్లాలో బీజేపీకి గెలిచే సత్తా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, మాజీఅధ్యక్షుడు ప్రహ్లాద్రావు, శివరాజ్, మాధవరెడ్డి, రమేష్, పాండుగౌడ్, పోకల సతీష్, రాజేందర్రెడ్డి, వివేకానందరెడ్డి, విజయేందర్రెడ్డి, బుస్సా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.