పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్‌

ABN , First Publish Date - 2021-06-18T05:07:51+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ముద్రించిన పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. మొదటి విడతగా పంపిన పుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి. కొద్దిరోజుల్లో వాటిని విద్యార్థులకు అందివ్వనున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 25 లక్షల పుస్తకాలు అవసరం.

పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్‌
జిల్లా కేంద్రంలోని భవనంలో పాఠ్యపుస్తకాల నిల్వలు

 మండల కేంద్రాలకు చేరిక

ఏడో తరగతికి నూతన సిలబస్‌

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ముద్రించిన పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. మొదటి విడతగా పంపిన పుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి. కొద్దిరోజుల్లో వాటిని విద్యార్థులకు అందివ్వనున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 25 లక్షల పుస్తకాలు అవసరం. వీటిని ప్రభుత్వం దశల వారీగా పంపిస్తుంది. మొదటి విడతలో 11,10,479 పుస్తకాలు వచ్చాయి. ఇందులో 2,08,466 పుస్తకాలను మండల విద్యాశాఖ కార్యాలయాలకు చేర్చారు. రెండో విడతలో 13,89,934 పుస్తకాలు రావాల్సి ఉంది. ఇవి వచ్చిన వెంటనే అన్ని పుస్తకాలను కలిపి పాఠశాలలకు చేర్చుతామని జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి చెబుతున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం(రెండు మాధ్యమాల్లో) ముద్రించారు. ఆరో తరగతి నుంచి 10 వరకు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం వేర్వేరుగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. 

ఏడో తరగతికి కొత్త సిలబస్‌

ఈ ఏడాది ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాలు మారనున్నాయి. వీరికి కొత్త సిలబస్‌ రానుంది. ఈ పాఠ్యపుస్తకాల ముద్రణ జరుగుతోంది. మిగిలిన తరగతుల పుస్తకాలు మాత్రమే వస్తున్నాయి. ఏటా విద్యా సంవత్సరం జూన్‌ రెండోవారంలో ప్రారంభం అవుతుంది. గతేడాది, ఈ ఏడాది కరోనా కారణంగా అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై తరగతులు నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్‌ మూడో దశపై వస్తున్న వార్తలతో విద్యా సంస్థల ప్రారంభంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. వచ్చే నెలలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పరీక్షలు, ఫలితాల తతంగం పూర్తయిన తరువాత కానీ ఇంటర్‌, డిగ్రీ, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు చేరే పరిస్థితి ఉండదు. ఈవిధంగా ఈ ఏడాది కూడా విద్యాసంవత్సరం గందరగోళంగా తయారుకానుంది. దీనికి తోడు ప్రభుత్వం నూతన విద్యా విధానానికి రూపకల్పన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంగన్‌వాడీ బడుల్లోని పిల్లలను ప్రాథమిక పాఠశాలకు తరలించి పూర్వ విద్యా బడులుగా పిలవాలని భావిస్తోంది. అలాగే ప్రాథమిక విద్యాలయాల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించాలనుకుంటోంది. ఉన్నత పాఠశాలలల్లో ఉన్న 9, 10 తరగతులను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేర్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా పూర్తి స్పష్టతకు రాలేదు. 


Updated Date - 2021-06-18T05:07:51+05:30 IST