బాలుడిని ఆదుకుంటాం..
ABN , First Publish Date - 2021-06-15T05:44:28+05:30 IST
కరోనా మహమ్మారికి తల్లిదండ్రులు బలై అనాథగా మిగిలిన బాలుడు గురించి జిల్లా బాలల సంరక్షణ సంస్థ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
తెనాలి కొత్తపేట, జూన్ 14: కరోనా మహమ్మారికి తల్లిదండ్రులు బలై అనాథగా మిగిలిన బాలుడు గురించి జిల్లా బాలల సంరక్షణ సంస్థ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. కరోనా మిగిల్చిన కన్నీటి గాఽథ అనే శీర్షికతో వెలువడిన కథనానికి జిల్లా బాలల సంరక్షణ సంస్థ అధికారులు స్పందించారు. సోమవారం తెనాలి పట్టణంలో ఉంటున్న కె.సాయిరామ్, అతని మేనమామ మహేంద్రనాథ్ గుప్తాను డీసీపీవో నాగకోటేశ్వరరావు కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వల్ల బాలుడి కుటుంబసభ్యులు మృతి చెందినట్లు ఏ విదమైన పత్రాలు అందించకపోవడం వల్లే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని వారికి వెల్లడించారు. అవసరమైన మరణ ధ్రువీకరణ పత్రాలను త్వరితగతిన తమకు అందజేస్తే ఒక నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు పంపి బాలుడికి లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పత్రాలను ఐసిడిఎస్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. విచారణలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుచిత్ర, అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి పాల్గొన్నారు.