భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
ABN , First Publish Date - 2022-08-29T05:13:47+05:30 IST
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ సందర్శనార్థం భక్తులు ఆదివారం పొరుగు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు.
మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ
చేర్యాల, ఆగస్టు 28: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ సందర్శనార్థం భక్తులు ఆదివారం పొరుగు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తజనమయ్యాయి. స్వామివారి నిత్యకల్యాణం, ఆర్జితసేవలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సంప్రదాయబద్ధంగా మట్టికుండలో పాయసం వండి నైవేద్యం సమర్పించారు. చెలక, నజరు, ముఖమండప పట్నాలు రచించి గంగిరేగుచెట్టుకు ముడుపు కట్టి తమ కష్టాలను తీర్చాలని వేడుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు, బండారి సమర్పించారు. అలాగే మల్లన్న సహోదరి ఎల్లమ్మతల్లికి కల్లు, బెల్లంపానకం సాక పెట్టి బోనం నివేదించారు.
నాచగిరి, వర్గల్ క్షేత్రాల్లో
వర్గల్: వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనృసింహ్మాస్వామి క్షేత్రం, వర్గల్ విద్యాధరి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో నాచగిరి, విద్యాధరి క్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నాచగిరి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వర్గల్ విద్యాధరి క్షేత్రంలో చిన్నారులకు సామూహిక అక్షరభ్యాసాలు చేయించారు. క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ భోజన వసతిని ఏర్పాటు చేసింది.