భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-01-19T06:29:59+05:30 IST
తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు పట్టుకున్నారు.
కారు, 686 బాటిళ్లు స్వాధీనం
ఇరువురు నిందితుల అరెస్ట్
వివరాలను వెల్లడించిన ఎస్ఈబీ ఏసీ శ్రీనివాసచౌదరి
ఒంగోలు (క్రైం), జనవరి 18: తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు పట్టుకున్నారు. మద్యం రవాణా చేస్తున్న కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు, ఇరువురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక ఎస్ఈబీ సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఈబీ ఏసీ శ్రీనివాసచౌదరి వివరాలను వెల్లడించారు. స్థానిక వెంగముక్కలపాలెం రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఈబీ అధికారులు అనుమానాస్పదంగా ఉన్న కారును ఆపి పరిశీలించగా భారీగా మద్యం బాటిళ్లు దొరికాయి. తెలంగాణలో వాటి కొనుగోలు రూ.83వేలు కాగా ఇక్కడ సుమారుగా రూ.1.2లక్షలకు విక్రయాలు జరుపుతారని తెలిపారు. కారు యజమాని కొండపి మండలం కె.ఉప్పలపాడుకు చెందిన గుండపనేని మురళీమోహన్, అతని వ్యాపార భాగస్వామి అయిన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన పంచాది రామారావులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిరువురూ ఇప్పటికి ఐదు పర్యాయాలు మద్యం అక్రమంగా తరలించినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. సమావేశంలో ఎస్ఈబీ ఈఎస్ యు.అరుణకుమారి, సీఐ ఎం. రమేష్, ఎస్సైలు కె.రమేష్, రాజేంద్రప్రసాద్లతో పాటు హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు గోపాల్రెడ్డి, నాగేశ్వరరావు, డి. కోటేశ్వరరావు ఉన్నారు.