Bandi Sanjay Kumar: హిమంత బిశ్వశర్మపై టీఆర్ఎస్ కార్యకర్త దాడి యత్నంపై బండి సంజయ్ కన్నెర్ర
ABN , First Publish Date - 2022-09-10T02:09:15+05:30 IST
కరీంనగర్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై టీఆర్ఎస్ నేతల వైఖరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుబట్టారు.
కరీంనగర్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై టీఆర్ఎస్ కార్యకర్త దాడి యత్నంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కన్నెర్ర చేశారు. దాడిని సమర్దించుకుంటున్న టీఆర్ఎస్ నేతల వైఖరిని ఆయన తప్పుబట్టారు. బీజేపీ నేతలను చూస్తే టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నాయకులను గౌరవించలేని టిఆర్ఎస్ నేతల వైఖరి దారుణమన్నారు. గణేష్ నిమజ్జనంపై అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, కేసీఆర్ కుట్రలను హిందువులు తిప్పి కొట్టారని చెప్పారు.
అంతకు ముందు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొన్న బహిరంగసభలో ఉద్రిక్తత నెలకొంది. శర్మ మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు సమీపం దాకా రావడంతో పాటు మైక్ విరిచేశాడు. శర్మను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలేవో చేశాడు. అప్రమత్తమైన భాగ్యనగర్ ఉత్సవ్ సమితి నాయకులు వెంటనే టీఆర్ఎస్ కార్యకర్తను స్టేజీపై నుంచి కిందకు దించేశారు. ఇంతలో వచ్చిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తను అక్కడ నుంచి తరలించారు. భద్రతా వైఫల్యంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు.
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం నిజాం పాలనని కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కుటుంబ పాలన నుండి విముక్తి కలిగాలని భాగ్యలక్ష్మీ అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. కేవలం ఒక కుటుంబానికే పరిమితమైన అధికారం తెలంగాణ ప్రజలందరికీ రావాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో అందరి ఇండ్లలోకి మహాలక్ష్మి రావాలని వేడుకున్నానని శర్మ తెలిపారు.