వారిని గెలిపించినందుకు రైతాంగానికి శిక్షా?: Nimmala
ABN , First Publish Date - 2022-02-02T16:57:27+05:30 IST
ఉభయగోదావరి జిల్లాల రైతుల ధాన్యం బకాయిలు విడుదల చేయాలని సీయం జగన్కు రెండు జిల్లాలకు చెందిన పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖ రాశారు.
ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల రైతుల ధాన్యం బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్కు రెండు జిల్లాలకు చెందిన పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖ రాశారు. బుధవారం ఉదయం ఏలూరులో ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ ధాన్యం అమ్మి 3, 4 నెలలు గడుస్తున్నా నేటికి రైతులకు సొమ్ము చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే, గత పంట పెట్టుబడికి వడ్డీ ఎవరు కడతారు? రెండో పంట దాళ్వాకు పెట్టుబడి ఎలా తేవాలి? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు వివరాలను పారదర్శకంగా చూపించవలసిన ప్రభుత్వం ఆన్లైన్ నుండి ఎందుకు వాటిని తొలగించిందని నిలదీశారు. గోదావరి జిల్లాల రైతులు 27 మంది వైసీపీ ఎమ్మెల్యేలను, 5 మంది వైసీపీ పార్లమెంట్ సభ్యులను గెలిపించినందుకు రైతాంగానికి శిక్ష విధిస్తారా? అని మండిపడ్డారు. గోదావరి జిల్లాల పట్ల, రైతాంగం పట్ల నిర్లక్ష్యం, కక్షను ముఖ్యమంత్రి విడనాడాలని ఎమ్మెల్యేలు హితవుపలికారు.