పోరు లాభం.. Minister Vellampalli తీరే టీడీపీకి వరం..!

ABN , First Publish Date - 2022-01-04T06:35:15+05:30 IST

పోరు లాభం.. Minister Vellampalli తీరే వీరికి వరం..!

పోరు లాభం.. Minister Vellampalli తీరే టీడీపీకి వరం..!

  • ప్రొటోకాల్‌ రగడతో పశ్చిమలో ఒక్కటవుతున్న విపక్షం
  • ఏకతాటిపైకి టీడీపీ నేతలు.. మంత్రి తీరే వీరికి వరం!

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టుండి కదలిక వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నోటి దురుసు, ఒంటెత్తు పోకడలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఒక్కటవుతున్నాయి. నియోజకవర్గంలోని 52వ డివిజన్లో మంత్రి వెలంపల్లికి, టీడీపీకి చెందిన స్థానిక కార్పొరేటర్‌ ఉమ్మడి చంటికి మధ్య ఆదివారం ప్రొటోకాల్‌ విషయమై చోటుచేసుకున్న వాగ్వాదం పెద్దదై కేసుల వరకూ వెళ్లింది. ఆ సమయంలో కార్పొరేటర్‌ను మంత్రి అసభ్య పదజాలంతో దూషించడం టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయింది. ఈ ఘటనతో ఇప్పటి వరకూ గ్రూపులుగా ఉన్న టీడీపీ నేతలు మంత్రి తీరును ఎండగట్టడంలో ఒక్కటయ్యారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిన్నటి వరకు అంతర్గత కలహాలతో అట్టుడికిన టీడీపీ ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. టీడీపీ అధిష్ఠానం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపీ నానిని నియమించింది. ఆయన పశ్చిమ టీడీపీ నాయకులను ఏకతాటిపైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించకపోవడాన్ని తప్పు పడుతూ స్థానిక కార్పొరేటర్‌ ఉమ్మడి చంటి మంత్రి వెలంపల్లితో వాగ్వాదానికి దిగడం, మంత్రి ఆయనను తీవ్ర పదజాలంతో దూషించడంతో టీడీపీ శ్రేణులన్నీ కదిలాయి. నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఉన్న బుద్దా వెంకన్న మంత్రి వెలంపల్లిపై విమర్శల బాణాలను సంధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు మంత్రి అక్రమాలను ప్రశ్నించడంలో పశ్చిమ టీడీపీ నాయకులు వెనుకబడ్డారన్న విమర్శ ఉండేది. ఆదివారం నాటి ఘటనతో ఆ విమర్శకు టీడీపీ నాయకులు చెక్‌ పెట్టారు.


జరిగింది ఇదీ..

పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్‌లో ఆదివారం మంత్రి వెలంపల్లి పర్యటించారు. స్థానికంగా నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రొటోకాల్‌ ప్రకారం స్థానిక కార్పొరేటర్‌ను పిలవాల్సి ఉండగా, పిలవకుండానే నిర్వహించారు. కొంతకాలంగా అధికార పార్టీ నాయకుల తీరు ఇలాగే ఉండడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న చంటి అక్కడికి వెళ్లి.. ప్రొటోకాల్‌ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి.. చంటిపై దూషణకు దిగారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి తీరును నిరసిస్తూ చంటి నిరసనకు దిగారు. దీంతో అధికార పార్టీ నాయకులు చంటిపై పోలీసు కేసు పెట్టారు. మంత్రి తనను తిట్టారని చంటి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు చంటి ఫిర్యాదును పట్టించుకోలేదు.


ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా విలేకరుల సమావేశం పెట్టి మంత్రి తీరుపై విరుచుకుపడ్డారు. దుర్గగుడిలో హుండీ ఆదాయం దోచుకుంటున్నారని.. కొబ్బరిచిప్పల మంత్రి అంటూ వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెలంపల్లి వ్యవహరించిన తీరు నియోజకవర్గంలో ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేదిలా ఉంది. మంత్రి స్థాయిలో ఉండి హుందాగా వ్యవహరించకుండా కార్పొరేటర్‌ను అసభ్య పదజాలంతో దూషించడమేమిటంటూ స్థానికులు సైతం విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ టీడీపీ నాయకుల స్పందన పట్ల కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - 2022-01-04T06:35:15+05:30 IST