కాపుల దృష్టిలో జగన్‌ మోసపు రెడ్డిగా మిగిలారు: Nimmala

ABN , First Publish Date - 2021-07-22T18:07:37+05:30 IST

జగన్‌మోహన్‌ రెడ్డి కాపులకు ఇచ్చిన హామీలన్నీ తుంగలోతొక్కి వారి దృష్టిలో జగన్‌ మోసపు రెడ్డిగా

కాపుల దృష్టిలో జగన్‌ మోసపు రెడ్డిగా మిగిలారు: Nimmala

అమరావతి: జగన్‌మోహన్‌ రెడ్డి కాపులకు ఇచ్చిన హామీలన్నీ తుంగలోతొక్కి వారి దృష్టిలో జగన్‌ మోసపు రెడ్డిగా మిగిలారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.2వేల కోట్ల చొప్పున, ఐదేళ్లలో రూ.10 వేలకోట్లు ఇస్తానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. వై.ఎస్సార్ చేయూత పేరుతో 45 ఏళ్లు పైబడిన కాపు మహిళలకు ఏటా రూ.15వేలు ఇస్తానని చెప్పి వారిని మోసగించారని విమర్శించారు. కాపు సంక్షేమం పేరుతో రాష్ట్రంలో కోటి50లక్షల మంది కాపులుంటే, కేవలం 3 లక్షల మందికే కాపు నేస్తం అమలు చేసి, మిగిలినవారికి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


బ్రిటీషు వారు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లను నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి రద్దు చేశారని తెలిపారు.  చంద్రబాబు నాయుడు తిరిగి వాటిని పునరుద్ధరిస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని నిలిపేశారన్నారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, విదేశాలకు వెళ్లి చదువుకునే కాపు యువతకు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఆర్థికసాయం చేశారని గుర్తు చేశారు. కాపు  యువత స్వయం ఉపాధికి  రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు రుణాలు అందించారన్నారు. ప్రతి జిల్లాలో కాపుభవన్‌ల నిర్మాణానికి రూ.2కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు కేటాయించారని నిమ్మల రామానాయుడు తెలిపారు. 

Updated Date - 2021-07-22T18:07:37+05:30 IST