పేదల ఇళ్లు కూల్చాలని చూస్తే తిరగబడతాం

ABN , First Publish Date - 2022-10-03T05:33:09+05:30 IST

పేదల ఇళ్లను కూల్చాలని చూస్తే తిరగబడతామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ హెచ్చరించారు.

పేదల ఇళ్లు కూల్చాలని చూస్తే తిరగబడతాం

ఒక్క ఇటుక తొలగించినా.. 

వైసీపీ నాయకులు మూల్యం చెల్లించుకుంటారు..

అధికార పార్టీ నాయకులపై పరిటాల శ్రీరామ్‌ ఫైర్‌


ధర్మవరం, అక్టోబరు 2: పేదల ఇళ్లను కూల్చాలని చూస్తే తిరగబడతామని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ హెచ్చరించారు. ఎక్స్‌కవేటర్లను పగులగొడతామన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా పేదలు ఇళ్లు కట్టుకుని 40 ఏళ్లుగా జీవిస్తున్నారు. వీటిని కూల్చడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు సాగిస్తుండటంతో కొందరు బాధితులు ఈవిషయాన్ని పరిటాలశ్రీరామ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆదివారం ఆ ప్రాంతానికి వచ్చారు. బాధితులతో  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దనీ, పరిటాల కుటుంబం అండగా ఉంటుందన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో శ్రీరామ్‌ మాట్లాడుతూ... అధికార పార్టీ నాయకులు తాము స్థలం కొనుగోలు చేశామనీ, తక్షణమే ఖాళీ చేయాలనీ, లేదంటే డబ్బులిస్తే రిజిస్ట్రేషన చేయిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి ఉన్న పేదల ఇళ్లను ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్న వారికే స్థలంపై హక్కు ఉంటుందన్నారు. స్థల యజమానులు.. రౌడీలను అడ్డం పెట్టుకుంటే డబ్బు వస్తాయని ఆశపెట్టుకున్నారేమో భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. స్థల యజమానులు.. నేరుగా పేదలతో మాట్లాడుకోవాలే తప్ప.. మధ్యలో రౌడీలు, దళారీలను ఏర్పాటు చేసుకోవడం సరికాదన్నారు. ఇక్కడ ఒక్క ఇటుక తొలగించినా.. వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇలాంటి రౌడీలకు ఎమ్మెల్యే మద్దతు తెలిపితే ఆయన కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య, తెలుగు మహిళ నేత సాహెబ్బీ, నాయకులు, పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-03T05:33:09+05:30 IST