దూకుడు పెంచిన టీడీపీ

ABN , First Publish Date - 2020-02-20T07:27:19+05:30 IST

ఊహించని అపజయం నుంచి క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోంది. తాజగా అధినేత చంద్రబాబునాయుడు జనచైతన్యయాత్ర పేరుతో బస్సుయాత్రను బుధవారం ప్రారంభించారు

దూకుడు పెంచిన టీడీపీ

గుంటూరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఊహించని అపజయం నుంచి క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోంది. తాజగా అధినేత చంద్రబాబునాయుడు జనచైతన్యయాత్ర పేరుతో బస్సుయాత్రను బుధవారం ప్రారంభించారు. దీనికి అనుసంధానంగా అసెంబ్లీ నియోజవర్గాల్లో స్థానిక నేతలు చైతన్యయాత్రల పేరుతో పర్యటనలు ప్రారంభించారు. గత తొమ్మిది నెలల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీకి మరింత మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పార్టీశ్రేణులు కార్యాచరణను సిద్ధంచేశాయి. 


కీలక నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల నియామకం

టీడీపీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు అధినేత చంద్రబాబు జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జ్‌లను ప్రకటించారు. బాపట్ల నియోజకవర్గ పగ్గాలను పార్టీ నేత వేగశన నరేంద్రవర్మకు అప్పగించింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన అన్నం సతీష్‌ప్రభాకర్‌ ఆ తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ దాదాపు 8నెలలుగా పార్టీ కార్యకర్తలకు నేరేంద్రవర్మ అండగా ఉంటూ టీడీపీ పిలుపుమేరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన్నే ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకొంది. ఎన్నికలకు ముందే 2-3 ఏళ్ళ నుంచి నరేంద్రవర్మ పోటీచేయాలనే ఉత్సాహంతో ఉన్నారు. అయితే అధినేత హామీ మేరకు నరేంద్రవర్మ  పార్టీ అభ్యర్థి తరపున శక్తివంచన లేకుండా  కృషి చేశారు.   


మాచర్లలో మళ్లీ చలమారెడ్డికే...

ఫ్యాక్షన్‌, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న మాచర్ల నియోజకవర్గ టీడీపీ పగ్గాలు మళ్లీ కొమ్మారెడ్డి చలమారెడ్డికే అప్పగించారు. సీనియర్‌ నేతగా ఉన్న చలమారెడ్డికి 2009 ఎన్నికల్లో ముందు తొలి జాబితాలో టిక్కెట్‌ ఖరారైంది. అప్పట్లో ఎంపీ అభ్యర్ధి వేణుగోపాలరెడ్డి జోక్యంతో చలమారెడ్డి టిక్కెట్‌ రద్దయి జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెరపైకి వచ్చారు. బ్రహ్మారెడ్డి ఓడిపోయిన తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. ఈ దశలో వచ్చిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా చిరుమామిళ్ళ మధును తెరపైకి తెచ్చారు. మధు ఓడిపోయారు. 2014 సాధారణ ఎన్నికల్లో  చివరి నిమిషంలో చలమారెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. ఆ ఎన్నికల్లో చలమారెడ్డి ఓడిపోయారు. ఐదేళ్ళ పాటు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో చలమారెడ్డికి అవకాశం ఇవ్వకుండా  హైదరాబాద్‌లో ఉంటున్న పారిశ్రామికవేత్త అంజిరెడ్డిని రంగంలోకి దింపారు. ఓటమి తరువాత అంజిరెడ్డి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల్లో  చలమారెడ్డి అంకితభావంతో పనిచేస్తున్నారు.  దీంతో అధినేత మరో ప్రత్యామ్నాయవైపు చూడకుండా చలమారెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 


సత్తెనపల్లి, ప్రత్తిపాడులపై స్పష్టత రావాలి...

మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు అకాలమరణంతో సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జి పోస్టు ఖాళీ అయ్యింది. పార్టీకి మొదటి నుంచి పట్టున్న ప్రాంతం కావటంతో పలువురు అశావహులు ఆ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు.  కోడెల  తనయుడు డాక్టర్‌ శివరామ్‌కు సత్తెపపల్లి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారని తొలుత భావించారు. అయితే ఆయన తన తండ్రి మరణం తర్వాత పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నియామకంపై అధిష్ఠానం దృష్టి సారించాల్సివుంది. ప్రత్తిపాడు నియోజకవర్గానికి కూడా పార్టీ ఇన్‌చార్జిని నియమించాల్సి వుంది. ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ నియోజకవర్గంలో కూడా టీడీపీకి పటిష్ట కేడర్‌ ఉంది. ఇటీవల అధినేత చంద్రబాబు సీనియర్‌ నేత, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యతో పార్టీ, నియోజకవర్గ విషయాల గురించి దాదాపు రెండు గంటలపాటు చర్చించినట్లు సమాచారం. ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నియామకంపైనా అధిష్ఠానం దృష్టిసారించాలని ఇక్కడి తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.

Updated Date - 2020-02-20T07:27:19+05:30 IST