టీడీపీ దూకుడు!

ABN , First Publish Date - 2021-01-27T06:38:21+05:30 IST

జిల్లాలో పంచాయతీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది

టీడీపీ దూకుడు!
బనగానపల్లెలో కార్యకర్తలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి

  1. తొలి విడత మండలాల్లో సమావేశాలు
  2. వైసీపీకి పట్టున్న గ్రామాలపైనా దృష్టి
  3. వర్గపోరుతో వైసీపీ సతమతం


కర్నూలు, ఆంధ్రజ్యోతి: జిల్లాలో పంచాయతీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. గెలుపు గుర్రాల కోసం వేట మొదలైంది. తొలి విడత ఎన్నికల ప్రక్రియకు వ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ దూకుడు ప్రదర్శిస్తుండగా.. వైసీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో అధికారపార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. కోడుమూరులో మూడు వర్గాలు, నందికొట్కూరులో రెండు వర్గాలుగా ఆ పార్టీ నాయకులు చీలిపోయారు. 

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో టీడీపీ కాస్త దూకుడుగా ఉంది. బనగానపల్లె, కోడుమూరు, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆదోని, కల్లూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో బీసీ జనార్దన్‌ రెడ్డి, కోట్ల సుజాతమ్మ, బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరిత తదితరులు కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. కోడుమూరులో 13 పంచాయతీలు, బనగానపల్లె మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, సి.బెళగల్‌లోని 18, గూడూరులోని 9, ఆళ్లగడ్డలోని 99 గ్రామ పంచాయతీలకు, గోస్పాడు మండలంలోని 15, నంద్యాలలో 17, బండి ఆత్మకూరు 20, మహానందిలో 13, వెలుగోడులోని 8, ఆత్మకూరులో 16, కల్లూరులోని 18 పంచాయతీలకు అభ్యర్థులను టీడీపీ ఖరారు చేస్తున్నారు. గతం కంటే ఈసారి టీడీపీ తరపున అభ్యర్థులు అధికంగా ముందుకు వస్తున్నారు. టీడీపీ బలంగా ఉన్న పంచాయతీల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. ఇక అధికార పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. ఆ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఇది ఇబ్బందిపెట్టే అవకాశం కనిపిస్తోంది. వైసీపీలో వర్గ పోరుతో సతమతమవుతున్న మండలాలపైనా టీడీపీ నాయకులు దృష్టి పెట్టారు. 29 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుండగా కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం కొసమెరుపు. అధికారులను నియమించకపోవడం, ఓటరు జాబితా తదితర అంశాలపై స్పష్టత లేకపోవడంతో స్థానికంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.


ఆ రెండు చోట్ల..

పార్టీ గుర్తుతో సంబంధంలేని ఎన్నికలు కావడంతో ఈసారి వైసీపీలో ఆధిపత్య పోరు బహిరంగంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే, సమన్వయకర్తలు తమ బలాబలాలను నిరూపించుకోవడం కోసం ఆరాటపడుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఆది నుంచి ఈ వర్గ పోరు ఉంది. స్థానిక దళిత ఎమ్మెల్యేకు కనీస ప్రాధాన్యం ఇవ్వకుం డా సమన్వయకర్త సిద్ధార్థరెడ్డి వ్యవహరిస్తుండటంతో ఇరు నాయకుల వర్గీయులు గతంలో కర్నూలులో అర్ధరాత్రి బాహాబాహీకి దిగారు. అప్పట్లో కొందరు రాష్ట్ర స్థాయి నేతలు కల్పించుకుని చక్కదిద్దారు. ఇపుడు మరోసారి సిద్ధార్థరెడ్డి స్థానికంగా వర్గ పోరుకు కాలుదువ్వుతున్నారు. నియోజకవర్గంలోని నందికొట్కూరు, పగిడ్యాల, మిడ్తూరు, జూపాడుబంగ్లా, కొత్తపల్లె, పాములపాడు మండలాల్లోనూ తన వర్గీయులను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలోలా వివాదాలకు తావు లేకుండా సంయమనం పాటించాలని ఎమ్మెల్యే ఆర్థర్‌ పలువురితో అంటున్నట్లుగా తెలుస్తోంది. 

కోడుమూరులో దాదాపు ఇదే స్థాయిలో ఆధిపత్య పోరు ఉంది. గూడూరు, కర్నూలు మండలం, కోడుమూరు, సి.బెళగల్‌ మండలాల్లో పట్టు సాధించాలని ఎమ్మెల్యే జె.సుధాకర్‌ ప్రయత్నిస్తున్నారు. కర్నూలు, గూడూరు, కోడుమూరు మండలాల్లో ఎమ్మెల్యే వర్గీయులకు దీటుగా కోట్ల హర్ష కూడా తమ వర్గీయులతో నామినేషన్లు వేయించేందుకు సమాయత్తమవుతున్నారు. సి.బెళగల్‌ మండలంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వర్గీయులు కూడా బరిలో నిలుస్తూ ఎమ్మెల్యే, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి బలపరిచే అభ్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. ఉన్న నాలుగు మండలాలకు మూడు వర్గాల నడుమ ఆధిపత్య పోరుతో వైసీపీ బరిలోకి దిగుతోంది. ఆ నాలుగు మండలాల్లో టీడీపీ బలం పుంజుకుంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తవగా కోట్ల జయ సూర్యప్రకాశ్‌ రెడ్డి తుది నిర్ణయాన్ని వెలువరించడమే తరువాయి. 


Updated Date - 2021-01-27T06:38:21+05:30 IST