చేతగాని ప్రభుత్వంతో రైతులకు నష్టం

ABN , First Publish Date - 2020-11-29T05:08:52+05:30 IST

చేతగాని ప్రభుత్వం తన చేతగానితనంతో, నిర్లక్ష్యంతో రైతులను నిండా ముంచేస్తోందని టీడీపీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చేతగాని ప్రభుత్వంతో రైతులకు నష్టం

నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి

టీడీపీ రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): చేతగాని ప్రభుత్వం తన చేతగానితనంతో, నిర్లక్ష్యంతో  రైతులను నిండా ముంచేస్తోందని టీడీపీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నివర్‌ తుఫాను వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని దుయ్యబట్టారు. ఈ ఖరీఫ్‌లోనే వరుసగా నాలుగు విపత్తులతో 20 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి రైతులు తల్లడిల్లిపోతున్నారన్నారు. నివర్‌ తుఫాను గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసి తగిన జాగ్రత్తలు చేసి ఉంటే నష్టం జరిగేది కాదన్నారు. గత ఏడాది విపత్తు వల్ల జరిగిన నష్టాలకు ఇంతవరకూ పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. నివర్‌ తుఫాను వల్ల 10 జిల్లాలు, 300 మండలాల్లో 5 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారన్నారు.  ఒక్క కడప జిల్లాలోనే 73 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందన్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారన్నారు. రిజర్వాయర్లలో ఎప్పుడెంత స్టోరేజీ ఉండాలో, ఇన్‌ఫ్లో ఉండాలో అన్నదానిపై అవగాహన లేకపోవడంతో ప్రజల ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారన్నారు. నీట మునిగిన పట్టణాలు, గ్రామాల ప్రజలకు సరైన పునరావాస శిబిరాలు, భోజన సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే బుగ్గవంక డ్యాం గేట్లు ఎత్తే సమయంలో ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, ముంపునకు గురి చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే అందించేలా చూడాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-11-29T05:08:52+05:30 IST