నల్లదొరల పెత్తనంలో పన్నులు, ధరల భారం
ABN , First Publish Date - 2022-08-15T06:34:56+05:30 IST
బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోతూ నల్లదొరలకు పెత్తనం ఇచ్చారని, వీరి పాలనలో దేశ ప్రజలు పన్నులు, ధరల భారంతో నలిగిపోతున్నారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.టాన్యా విమర్శించారు.
- సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి టాన్యా
- సేవ్ ఇండియా, సేవ్ పీపుల్ రౌండు టేబుల్ సమావేశం
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 14 : బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోతూ నల్లదొరలకు పెత్తనం ఇచ్చారని, వీరి పాలనలో దేశ ప్రజలు పన్నులు, ధరల భారంతో నలిగిపోతున్నారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.టాన్యా విమర్శించారు. ఆదివారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మావో భవన్లో సేవ్ ఇండియా, సేవ్ పీపుల్ పేరుతో నిర్వహించిన రౌండు టేబుల్ సమావేశంలో టాన్యా మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ వారి దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆనాడు పెద్దఎత్తున పోరాటం సాగించిందన్నారు. బ్రిటీష్ పాలకుల కంటే దుర్మార్గంగా పాలన సాగిస్తూ అంబానీ, అదానీలకు, గుత్త పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు దేశాన్ని దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. రూపాయి విలువ భారీగా పతనం అవుతోందని, నిరుద్యోగం, పేదరికం తీవ్రమైందన్నారు. పాలకుల కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాలని కోరారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ, పీఓడబ్ల్యు, ఏఐకేఎంఎస్ సంఘాల నాయకులు సీహెచ్ వెంకటేశ్వరరావు, వి.చిట్టిబాబు, పి.విజయలక్ష్మి, ఎస్.కిరణ్కుమార్, మయూరి, ఐ.రావణ, కె.భాను, ఐ.చంద్రశేఖర్, శివ, ధర్నేష్ పాల్గొన్నారు.