‘తాండవ్’పై మరో మెట్టు దిగి వెనక్కి తగ్గిన దర్శకుడు
ABN , First Publish Date - 2021-01-20T03:00:22+05:30 IST
సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో అమెజాన్ ప్రైమ్ వేదికగా జనవరి 15న విడుదలైన పొలిటికల్ థ్రిల్లర్ ‘తాండవ్’ వెబ్సిరీస్లో...
‘తాండవ్’ వెబ్సిరీస్లో మార్పులు చేస్తాం: దర్శకుడి ప్రకటన
సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో అమెజాన్ ప్రైమ్ వేదికగా జనవరి 15న విడుదలైన పొలిటికల్ థ్రిల్లర్ ‘తాండవ్’ వెబ్సిరీస్లో మార్పులుచేర్పులు చేయనున్నట్లు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ప్రకటించారు. ఈ వెబ్సిరీస్లోని కొన్ని సన్నివేశాలు హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా ఉన్నాయని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఇప్పటికే వెబ్సిరీస్ యూనిట్ బేషరతుగా క్షమాపణ చెప్పింది. తాజాగా.. ఈ వెబ్సిరీస్ దర్శకుడు వివాదానికి కారణమైన సన్నివేశాలను తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వివాదం తలెత్తడం పట్ల మరోసారి క్షమాపణ చెబుతున్నట్లు వెబ్సిరీస్ యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. హిందూ దేవుళ్లను కించపరుస్తూ నిర్మించినట్లు ఆరోపణలొచ్చిన ‘తాండవ్’ వెబ్ సిరీస్ నిర్మాత, దర్శకులపై యూపీలో క్రిమినల్ కేసు నమోదైంది. అమెజాన్ ఇండియా కంటెంట్ హెడ్ అపర్ణా పురోహిత్, సిరీస్ డైరెక్టర్ అలీ అబ్బాస్, నిర్మాత హిమాంశు కృష్ణ మెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ, మరో వ్యక్తిపై పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వెబ్ సిరీస్లో అభ్యంతరకర దృశ్యాలు, రోత సంభాషణలు ఉన్నట్లు ఎస్ఐ అమర్నాథ్ యాదవ్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. అయితే, తమ చిత్రం కేవలం కల్పితమని, ఏ కులాన్నీ, మతాన్నీ, ఏ రాజకీయ పార్టీనీ కించ పరిచే ఉద్దేశం లేదంటూ ‘తాండవ్’ తారాగణం, సిబ్బంది క్షమాపణ చెప్పింది.