అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. అమెరికాను హెచ్చరించిన తాలిబన్లు

ABN , First Publish Date - 2021-08-24T01:45:26+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్నతాలిబన్లు తాజాగా అమెరికాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆఫ్ఘన్ గడ్డపై నుంచి తమ బలగాలను వెనక్కి

అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. అమెరికాను హెచ్చరించిన తాలిబన్లు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్నతాలిబన్లు తాజాగా అమెరికాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆఫ్ఘన్ గడ్డపై నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించేందుకు అమెరికా పేర్కొన్న ఈ నెల 31 గడువును కనుక పెంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు రేపు (మంగళవారం) జి7 దేశాధినేతలు సమావేశమవుతున్న వేళ తాలిబన్లు ఈ హెచ్చరిక జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 


ఆగస్టు 31 డెడ్‌లైన్ అమెరికా బలగాల ఉపసంహరణకు ‘రెడ్ లైన్’ అని తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షమీన్ పేర్కొన్నారు. అమెరికా, లేదంటే ఇంగ్లండ్ కనుక ఖాళీ చేసేందుకు మరింత సమయం కోరితే ఏం చేస్తారన్న ప్రశ్నకు ‘నో’ అని సమాధానం చెప్పారు. గడువు పొడిగిస్తే ‘పరిణామాలు’ తీవ్రంగా ఉంటాయని ‘స్కై న్యూస్’తో మాట్లాడుతూ పేర్కొన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన వేలాదిమంది తమ పౌరులను ఈ నెల 31 లోపు స్వదేశం తరలించాలని యూఎస్, యూకే లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికి తోడు వేలాదిమంది ఆఫ్ఘన్లు దేశం విడిచేందుకు కాబూల్ విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, కాల్పుల్లో 20 మంది వరకు చనిపోయారు. ఆగస్టు 15న దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అమెరికా భద్రతా దళాల నియంత్రణలోనే ఉంది.   

Updated Date - 2021-08-24T01:45:26+05:30 IST