మిలటరీ వాళ్లకో, డిఫెన్స్‌ వాళ్లకో భయపడే పరిస్థితి లేదు: తలసాని

ABN , First Publish Date - 2020-07-02T15:36:39+05:30 IST

టీఆర్‌ఎస్‌కు చెందిన పాలక మండలి సభ్యులు ఉన్నందునే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో అభివృద్ధి పనులు చేపట్టగలుగుతున్నామని, ఇక నుంచి బోర్డు సభ్యులే అజెండా రూపొందిస్తారని, లేకపోతే సమావేశాలను

మిలటరీ వాళ్లకో, డిఫెన్స్‌ వాళ్లకో భయపడే పరిస్థితి లేదు: తలసాని

ఇకపై బోర్డు సభ్యులే అజెండా రూపొందిస్తారు

టీఆర్‌ఎస్‌ సభ్యులు ఉన్నందునే కంటోన్మెంట్‌ అభివృద్ధి

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడి


సికింద్రాబాద్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌కు చెందిన పాలక మండలి సభ్యులు ఉన్నందునే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో అభివృద్ధి పనులు చేపట్టగలుగుతున్నామని, ఇక నుంచి బోర్డు సభ్యులే అజెండా రూపొందిస్తారని, లేకపోతే సమావేశాలను బహిష్కరిస్తారని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. బుధవారం సికింద్రాబాద్‌లోని డిఫెన్స్‌ ఎస్టేట్‌ కార్యాలయంలో తలసాని అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో కంటోన్మెంట్‌ సమస్యలపై చర్చించారు. మంత్రి మల్లారెడ్డి, మున్సిపల్‌  శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, జలమండలి ఈడీ సత్యనారాయణ, కంటోన్మెంట్‌ సీఈవోలు చంద్రశేఖర్‌, అజిత్‌రెడ్డిలతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉండడం, వారు తరచూ తమపై, మంత్రి కేటీఆర్‌పై ఒత్తిడి తీసుకువస్తుండడంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను కంటోన్మెంట్‌లో అమలు చేస్తోందని తెలిపారు. 


లేకపోతే.... దేశంలోని ఇతర కంటోన్మెంట్లలో మాదిరిగా ఇక్కడ కూడా ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బ్రిగేడియర్‌, ఇతర అధికారులు కంటోన్మెంట్‌ బోర్డు సమావేశాల అజెండా రూపొందిస్తున్నారని, దాంతో సమావేశాలు రొటీన్‌గా జరుగుతున్నాయని చెప్పారు. ఇక నుంచి ప్రజలతో ఎన్నుకోబడిన బోర్డు సభ్యులు రూపొందించిన అజెండా ప్రకారమే సమావేశం జరగాలని, లేకపోతే తమ సభ్యులు బోర్డు పాలక మండలి సమావేశాలను బహిష్కరిస్తారని తలసాని స్పష్టం చేశారు. మిలిటరీ వాళ్లకో, డిఫెన్స్‌ వాళ్లకో భయపడే పరిస్థితి లేదన్నారు. రామన్నకుంట చెరువు ప్రక్షాళనపై తరచూ స్థానిక బోర్డు సభ్యుడు పాండుయాదవ్‌ ఒత్తిడి  చేస్తుండడంతో నిధులు మంజూరు చేయగలిగామని చెప్పారు. అలాగే బొలారం ఆస్పత్రి, ఇతర సమస్యలను కూడా సానుకూలంగా పరిశీలిస్తున్నామని తలసాని వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌ చార్జీల బకాయిలు, ఇతర నిధుల మంజూరు విషయమై గురువారం ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావును కలవనున్నట్టు తెలిపారు. కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి పలకాలని సూచించారు. బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సాదా కేశవరెడ్డి, బి.అనితప్రభాకర్‌, కె.పాండుయాదవ్‌, జీహెచ్‌ఎంసీ ఉత్తర మండల కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌రాజ్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌, రాజశేఖర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-02T15:36:39+05:30 IST