అక్కడ బీజేపీని గెలిపించే బాధ్యత నాది: సువేందు

ABN , First Publish Date - 2021-01-21T03:59:56+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం నందిగ్రామ్‌లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఇటీవల ఆ పార్టీలో చేరిన...

అక్కడ బీజేపీని గెలిపించే బాధ్యత నాది: సువేందు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీచేయనున్న నందిగ్రామ్‌లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నేత సువేందు అధికారి పేర్కొన్నారు. ఇటీవల అధికారి టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ఆయన.. ఇక్కడ మమతను ఓడించి బీజేపీని గెలిపించే బాధ్యతను తానే తీసుకుంటానని పేర్కొన్నారు. నందిగ్రామ్‌లో ‘జై శ్రీరాం’ అంటూ నినదించే 2 లక్షల మంది మద్దతు తనకు ఉందన్నారు. ‘‘నందిగ్రామ్‌లో బీజేపీ ఎవరిని నిలబెట్టినా వారిని గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటాను. 62 వేల ఓట్ల మీద నమ్మకంతో దీదీ (మమత) అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ అక్కడ ‘జై శ్రీరాం’ అని నినదించే 2.13 లక్షల మంది ప్రజల మద్దతు నాకుంది..’’ అని సువేందు పేర్కొన్నారు. ‘‘జై శ్రీరాం నినాదం ఇక్కడ నడవదు’’ అంటూ తృణమూల్ నేత సుబ్రతా బక్షి పేర్కొన్నట్టు వస్తున్న ఆరోపణలపైనా సువేందు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయనకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. కాగా తాను నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగనున్నట్టు సీఎం మమత సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘నేను నందిగ్రామ్‌కు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటా. ఇది నాకు కలిసొచ్చిన ప్రాంతం. 2016 నేను నందిగ్రాం నుంచే ఎన్నికల ప్రకటన చేశాను.. ఇప్పుడు కూడా నేను ఇక్కడికే వచ్చాను. 2021 ఎన్నికల్లో టీఎంసీ విజయం తథ్యం..’’ అని మమత పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-21T03:59:56+05:30 IST