నందిగ్రామ్ పోరు: 10న మమత, 12న సువేందు నామినేషన్

ABN , First Publish Date - 2021-03-08T23:44:58+05:30 IST

దిగ్గజాల మధ్య పోరుగా చెబుతున్న నందిగ్రామ్‌లో ఒక్కసారిగా నామినేషన్ల వేడి..

నందిగ్రామ్ పోరు: 10న మమత, 12న సువేందు నామినేషన్

కోల్‌కతా: దిగ్గజాల మధ్య పోరుగా చెబుతున్న నందిగ్రామ్‌లో ఒక్కసారిగా నామినేషన్ల వేడి పెరుగుతోంది. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 10న నామినేషన్ వేస్తున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా, బీజేపీ అభ్యర్థిగా మమతను ఢీకొంటున్న సువేందు అధికారి 12వ తేదీన నామినేషన్ వేయనున్నట్టు ఆ పార్టీ సోమవారంనాడు ప్రకటించింది.


నందిగ్రామ్‌లో 2007లో చేపట్టిన భూ సేకరణ వ్యతిరేక ఉద్యమం మమతా బెనర్జీ‌తో పాటు సువేందు అధికారికి మంచి పేరు వచ్చింది. నిన్నటి వరకూ మమతా బెనర్జీ విధేయుడుగా ఉంటూ వచ్చిన సువేందు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తన నియోజకవర్గమైన నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. 2016లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన ఘనవిజయం సాధించారు. సువేందుకు గుణపాఠం చెప్పేందుకు నందిగ్రామ్ పోరులో ఈసారి తాను స్వయంగా తలపడనున్నట్టు మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. కాగా, మమతపై 50,000 ఓట్లకు పైగా తేడాతో గెలుస్తానని సువేందు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సైతం ఆయననే నందిగ్రామ్ నుంచి మమతకు పోటీగా బరిలోకి దింపడంతో పోటీ రసవత్తరంగా మారింది.

Updated Date - 2021-03-08T23:44:58+05:30 IST