మూసా అసీన్కు శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2021-02-25T06:27:48+05:30 IST
ఈనెల 14 న జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన మూసాకు వైద్యులు బుధవారం శస్త్రచికిత్స నిర్వహించి అనంతరం బాలుడిని చిన్నపిల్లల వార్డులో అబ్జర్వేషన్లో ఉంచినట్లు మదనప ల్లె సీడీపీవో సుజాత చెప్పారు
మిగతా ఇద్దరినీ రుయాకు తీసుకెళ్లిన సిబ్బంది
మదనపల్లె క్రైం, ఫిబ్రవరి 24: ఈనెల 14వ తేదీన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్పూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మదనపల్లెకు చెందిన 14 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఈనేపథ్యంలో మృత్యుంజయులైన చిన్నారులు మహ్మద్ ఖాసీఫ్(12), యాస్మిన్(5), అస్మా(6), మూసాఅసీన్ (4)లు కోలుకుంటున్నారు. అయితే ప్రమాదంలో మూసా కుడిచేయి విరగడంతో శస్త్రచికిత్స చేయిం చేందుకు ఐసీడీఎస్ సిబ్బంది రెండురోజుల కిందట అక్కాతమ్ముడిని తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బుధవారం మూసాకు శస్త్రచికిత్స నిర్వహించి అనంతరం బాలుడిని చిన్నపిల్లల వార్డులో అబ్జర్వేషన్లో ఉంచినట్లు మదనపల్లె సీడీపీవో సుజాత చెప్పారు. అదేవిధంగా కనికలతోపులో బంధువుల ఇంటిలో వున్న మహ్మద్ ఖాసీఫ్, మదనపల్లెలో మేనమామ వద్దవున్న యాస్మిన్ను హెల్త్చెకప్ కోసం ఐసీడీఎస్ సిబ్బంది బుధవారం రుయాకు తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. అక్కడి వైద్యులు మహ్మద్ ఖాసీఫ్, యాస్మిన్, అస్మాలను పరీక్షించి మెరుగైన వైద్యం అందించినట్లు సీడీపీవో పేర్కొన్నారు.