హిందూ మహిళ ఆస్తులను.. పుట్టింటివారికీ ఇవ్వొచ్చు

ABN , First Publish Date - 2021-02-26T09:24:55+05:30 IST

హిందూ మహిళలు తమకు భర్త వైపు నుంచి వచ్చిన ఆస్తులను.. పుట్టింటి వారికి ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది.

హిందూ మహిళ ఆస్తులను.. పుట్టింటివారికీ ఇవ్వొచ్చు

దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: హిందూ మహిళలు తమకు భర్త వైపు నుంచి వచ్చిన ఆస్తులను.. పుట్టింటి వారికి ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. మహిళల ఆస్తులు తండ్రి తరఫు వారసులకు కూడా సంక్రమిస్తాయని స్పష్టం చేసింది. జగ్నో అనే మహిళకు సంబంధించిన ఆస్తి కేసును విచారించే క్రమంలో.. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. జగ్నో భర్త షేర్‌ సింగ్‌ 1953లోనే చనిపోయారు. అతడికి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములు జగ్నోకు సంక్రమించాయి. ఆ ఆస్తి బదిలీకి ఆమె తన తమ్ముడి కొడుకులతో ఒప్పందం చేసుకుంది. దీనిపై ఆమె మరిది వారసులు అభ్యంతరం చెబుతూ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా ధర్మాసనం.. ‘మహిళ తరఫు వారసులను బయటివారుగా భావించకూడదు’ అని స్పష్టం చేసింది. ‘‘కుటుంబం’’ అనే పదాన్ని  విస్తృత అర్థంలో చూడాలని సూచించింది. ఈ మేరకు జగ్నో మరిది వారసులు దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - 2021-02-26T09:24:55+05:30 IST