ప్రభుత్వ బడులకు ఆదరణ
ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST
వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగింది.
- ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- ఇంగ్లీష్ మీడియం బోధనతో పెరిగిన సంఖ్య
- బడిబాటకు అనూహ్య స్పందన
వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగింది. గతనెల మూడు నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో జిల్లాలో మొత్తం 17,394 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.
వికారాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల్లో చేరిన విద్యార్థుల సంఖ్య గతంలో కంటే పెరిగింది. ఇంతకు ముందకు సక్సెస్ పేరిట ఎంపిక చేసిన జడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన కొనసాగేది. అయితే ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయి. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. బడులకు దూరంగా ఉన్న బడీడు పిల్లలు, బాలకార్మికులను గుర్తించి వారినీ పాఠశాలల్లో చేర్పించారు.
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు
జిల్లాలో 5,524 మంది అంగన్వాడీ చిన్నారులు, ప్రైవేట్ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన 2,890 చిన్నారులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరారు. ప్రైవేట్ నుంచి ఒకటో తరగతిలో 1,253 మంది, 2 నుంచి 12వ తరగతి వరకు 1381 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. బంట్వారం మండలంలో 122, బషీరాబాద్లో 464, బొంరా్సపేట్లో 131, చౌడాపూర్లో 84 మంది, ధారూరులో 233, దోమలో 423 మంది విద్యార్థులు చేరారు. దౌల్తాబాద్ మండలంలో 209, కొడంగల్లో 255, కోట్పల్లిలో 86, కులకచర్లలో 211, మర్పల్లిలో 375, నవాబ్పేట్లో 199,. పరిగిలో 798, పెద్దేముల్లో 280, పూడూరులో 280, తాండూరులో 378, వికారాబాద్లో 488, యాలాల్ మండలంలో 287 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.
భారీగా విద్యార్థుల చేరిక
ఈ విద్యా సంవత్సరంలో జూన్ 30వ తేదీ వరకు జిల్లాలో 17,394 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 2890 మంది విద్యార్థులు చేశారు. ప్రాథమిక స్థాయిలో ప్రైవేట్ పాఠశాలల నుంచి 2634 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, వారిలో ఒకటో తరగతిలో 1253 మంది, రెండు నుంచి 12వ తరగతి వరకు 1381 మంది విద్యార్థులు చేరారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 6వ తరగతిలో చేరిన విద్యార్థులు 10,139 మంది ఉండగా, 7 నుంచి 8వ తరగతిలో 1351 మంది విద్యార్థులు చేరారు. 8 నుంచి 9వ తరగతిలో 279 మంది, ఓఎస్సీ నుంచి 101 మంది విద్యార్థులు చేరారు.
అంగన్వాడీ కేంద్రాల నుంచి ఒకటో తరగతిలో చేరిన వారు 2,890
ఒకటో తరగతిలో చేరిన ప్రైవేట్ విద్యార్థులు 1,253
2 నుంచి 12 వరకు చేరిన ప్రైవేట్ విద్యార్థులు 1,381
5 నుంచి 6వ తరగతిలో చేరిన విద్యార్థులు 10,139
7 నుంచి 8వ తరగతిలో చేరిన విద్యార్థులు 1,351
8 నుంచి 9వ తరగతిలో చేరిన విద్యార్థులు 279
పాఠశాలల్లో చేరిన బడిబయటి పిల్లలు 101
అడ్మిషన్లు పొందిన మొత్తం విద్యార్థులు 17,394