హౌసింగ్‌కు అంగన్‌వాడీ భవన నిర్మాణాల పర్యవేక్షణ

ABN , First Publish Date - 2020-10-23T10:55:01+05:30 IST

అంగన్‌వాడీ భవన నిర్మాణాల పర్యవేక్షణను గృహ నిర్మాణ (హౌసింగ్‌)శాఖకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హౌసింగ్‌కు అంగన్‌వాడీ భవన నిర్మాణాల పర్యవేక్షణ

 నేడో, రేపో అధికారిక ఉత్తర్వుల జారీ


చిత్తూరు అర్బన్‌, అక్టోబరు 22: అంగన్‌వాడీ భవన నిర్మాణాల పర్యవేక్షణను గృహ నిర్మాణ (హౌసింగ్‌)శాఖకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని మౌఖిక ఆదేశాలందాయి. నేడు, రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. జిల్లాలో 4,768 అంగన్‌వాడీ కేంద్రాలుండగా 768 చోట్ల సొంత భవనాల్లేవు. టీడీపీ పాలనలో ఉపాధి హామీ పథకం నిధులతో 501 భవనాలను నిర్మించడానికి అనుమతినిచ్చి, నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించారు. వీటిల్లో 412 భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం, రెవెన్యూ అధికారులు స్థలాలు సమయానికి కేటాయించక పోవడం వంటి కారణాలతో కొన్ని పునాదులతోనే ఆగిపోగా.. మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కేవలం 89 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ భవనాల నిర్మాణం చేపట్టాలి, ఏయేవి నిర్మాణ దశల్లో ఉన్నాయో సేకరించే పనిలో అధికారులున్నారు. ఇదిలా ఉంటే.. కొన్నిచోట్ల పునాదులు సరిగా లేవని.. అలాంటి చోట్ల మొదటి నుంచి నిర్మాణం చేపట్టాలే నివేదిక సిద్ధం చేస్తున్నారు. 


Updated Date - 2020-10-23T10:55:01+05:30 IST