జగన్ పాలనపై సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-10-31T20:03:17+05:30 IST
గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ పాలనపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో
విజయనగరం : గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ పాలనపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం విదితమే. మరీ ముఖ్యంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్దం దుర్ఘటన జరిగిన నాటి నుంచి మరింత డోస్ పెంచిన కమలనాథులు తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు. తాజాగా.. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్.. జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు విజయనగరంలో పర్యటించిన ఆయనకు జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ పాలనలో సింహాచలం నుంచి తిరుపతి దేవస్థానం వరకు దేవాదాయ భూములు వైసీపీ నేతల హస్తగతమవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో హిందూ మతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని సునీల్ వ్యాఖ్యానించారు. ఓ మత వ్యాప్తికి, అభివృద్ధికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని సునీల్ దేవధర్ ఆరోపించారు.
కాగా.. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా విజయసాయి వర్సెస్ కమలనాథుల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరిగింది. అంతేకాదు.. సునీల్-విజయసాయి మధ్య కూడా కొన్ని రోజుల పాటు ట్విట్టర్లో పురంధేశ్వరి విషయంలో ఇదివరకే మాటల తూటాలు పేలాయి. అప్పట్లో విజయసాయి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం విదితమే.