సహజీవనం చేస్తున్న ఇద్దరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-06-25T05:49:31+05:30 IST
సహజీవనం చేస్తున్న ఇద్దరు కుటుంబ కలహాల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం పేరేచర్లలో శుక్రవారం జరిగింది.
అనాథలుగా ఇద్దరు పిల్లలు
మేడికొండూరు, జూన్ 24: సహజీవనం చేస్తున్న ఇద్దరు కుటుంబ కలహాల కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం పేరేచర్లలో శుక్రవారం జరిగింది. మేడికొండూరు ఎస్ఐ నరహరి కథనం ప్రకారం గ్రామానికి చెందిన షేక్ హసన్వలి(38) నరసరావుపేటకు చెందిన కృష్ణవేణి అలియాస్ కీర్తన(32) పేరేచర్ల జంక్షన్లో గత రెండేళ్లుగా ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. వారితో పాటు ఇద్దరు చిన్నారులు ఉంటున్నారు. వారు కీర్తనకు చెందిన పిల్లలుగా భావిస్తున్నారు. హసన్వలికి మేడికొండూరులో భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. హసన్వలి, కీర్తన మధ్య తరచు ఘర్షణలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం మద్యాహ్నం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ తరువాత ఇంట్లో నుంచి పిల్లల ఏడుపు వినిపించడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా లోపల గడియ పెట్టి ఉంది. కిటికీలో నుంచి చూడగా పాస్టిక్ తాడుకు వేళాడుతూ హసన్వలి, నేలపై పడి ఉన్న కీర్తన మృతదేహాలు కనిపించాయి. ఎస్ఐ నరహరి తన సిబ్బందితో వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి మృతితో చిన్నారులిద్దరూ అనాథలుగా మారారు.